హుజుర్నగర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు...? సమావేశమైన సిపిఐ నేతలు
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ అధికార పక్షమైన టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఆ పార్టీ మద్దతు కోరింది. ఈ నేపథ్యంలోనే ఇరుపార్టీల నేతలు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపి, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై నేడు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
మద్దతుపై చర్చ.. నేడు సాయంత్రం నిర్ణయం
ఇందుకోసం సిపిఐ రాష్ట్ర కార్యవర్గం పార్టీ కార్యాలయంలో భేటి అయింది. ఇప్పటికే రెండు పార్టీల నేతలు తమను కలిసిన నేపథ్యంలోనే ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఎన్నికల మద్దతుపై స్థానిక పార్టీ కార్యకర్తలతో కూడ రాష్ట్ర నేతలు సమావేశమై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయంతో పాటు రాష్ట్ర నేతలు కూడ మద్దతు అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తే పార్టీకి లబ్ది చేకూరుతుందనే అంశాలంపై పార్టీ నేతలు చర్చించనున్నారు. సాయంత్రం ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అంశాన్ని స్పష్టం చేయనున్నారు.
టీఆర్ఎస్కే మద్దతు ఇస్తుంది...?
టీఆర్ఎస్ పార్టీతో సమావేశంలో భాగంగానే ఆపార్టీ నేతలు తమకే మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ కోరుతున్నట్టుగా పోడుభూముల సమస్యల పరిష్కారం తోపాటు , యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు చెప్పారు. కాగా యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం కూడ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాగా పార్టీతో పోత్తులు కేవలం హుజుర్నగర్ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్లో కొనసాగే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇచ్చారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న సిపిఐ
ముఖ్యంగా సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కోరిన స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించిందనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే ధోరణి అవలంబించారని కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర పార్టీ నేతలు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పోత్తుల అంశం కేవలం హుజుర్నగర్ ఉప ఎన్నికలకే కాకుండా రానున్న ఎన్నికల్లో సైతం ఉంటాయనే అభిప్రాయాన్ని సిపిఐ నేతలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ రిత్యా అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.