కలాం నవ్వుతూ నమస్తే అన్నారు, ఆశ్చర్యమేసింది: సైబరాబాద్ సిపి ఆనంద్
హైదరాబాద్: దివంగత భారత రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంతో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. పన్నెండేళ్లుగా కలాంతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో గొప్పగా నిలపాలని తపించిన మహనీయుల్లో అబ్దుల్ కలాం అగ్రస్థానంలో నిలుస్తారని చెప్పారు.
తాను మధ్య మండల డిసిపిగా ఉన్న రోజుల్లో కలాంను కలిసినట్లు తెలిపారు. 2003లో రాష్ట్రపతి హోదాలో కలాం నగరంలోని ఆదర్శనగర్ బిర్లా ప్లానెటోరియాన్ని సందర్శించారు. ఆ సమయంలో తాను సెల్యూట్ చేస్తే.. కలాం నవ్వుతూ నమస్తే అన్నారని, అది తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.

ఆ రోజు శాస్త్రవేత్తలతో, విద్యార్థులతో గ్రహాల స్థితిగతుల గురించి, ప్రకృతి గొప్పతనం గురించి కలాం వివరించిన తీరు తనకు ఇప్పటికీ గుర్తుందని ఆనంద్ తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ స్కూల్లో విద్యార్థులతో ముచ్చటించారని చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టించే తత్వాన్ని అలవర్చుకోవాలని కలాం వివరించారని తెలిపారు.
ఆ తర్వాత కలాం ఎన్నోసార్లు హైదాబాద్లో విద్యాసంస్థలకు వచ్చినప్పుడు కలిసినట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు ఎన్నికల సంఘం నుంచి లభించిన పురస్కారాన్ని ఢిల్లీలో కలాం చేతుల మీదుగా అందుకోవడం ఎన్నటికీ మర్చిపోలేని అనుభూతి అని సివి ఆనంద్ తెలిపారు.












Click it and Unblock the Notifications