రేవంత్ రెడ్డి ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలం: సెప్టెంబర్ 1న ఢిల్లీ వేదికగా..
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ వివాదానికి పరిష్కారం కనుగొనడానికి కేంద్ర జలసంఘం ముందడుగు వేసింది. ప్రాణహితపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర వివాదాలపై చర్చించడానికి సెప్టెంబర్ 1వ తేదీన ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాల ప్రతినిధులతో ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతోంది.
ఢిల్లీలోని సేవా భవన్లో ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తమ వాదనలను వినిపించనున్నారు. తుమ్మిడిహట్టికి సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్రాష్ట్ర జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ సంప్రదింపులు జరగనున్నాయి. దీనికి సీడబ్ల్యూసీ మధ్యవర్తిత్వం వహించనుంది.
ఈ ప్రాజెక్ట్ ఎత్తుపైనే ప్రధాన వివాదం నెలకొంది. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోంది. మహారాష్ట్ర మాత్రం 148 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నిర్మాణానికి గతంలో అంగీకరించింది కూడా. 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ ను నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యం కాదనేది తెలంగాణ వాదన. దీనివల్ల నీటిని పంపింగ్ చేయాల్సి వస్తుందని, ఫలితంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి ప్రభుత్వంపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఈ ఏడాది మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా చర్చల ద్వారా సరైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈ వ్యవహారాన్ని తదుపరి చర్యల కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ నెల 5న జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు మరో లేఖ రాశారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా కేంద్రం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. బ్యారేజీ నీటి మట్టాన్ని పెంచడం వల్ల ముంపునకు గురయ్యే అదనపు ప్రాంతాల తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ పై ఏర్పడిన వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన సీడబ్ల్యూసీఈ భేటీని నిర్వహించనుంది.













Click it and Unblock the Notifications