cyber crimes: ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా? సైబర్ మోసాల బారిన పడతారు జాగ్రత్త!!
ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా? ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ భారీ ఎత్తున యాడ్లు, మెసేజ్లు చూసి అందులో వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతున్నారా? ఉద్యోగాల కోసం ఏ వెబ్ సైట్ లో పడితే ఆ వెబ్ సైట్ లో మీ డేటా ఇస్తున్నారా? అయితే సైబర్ మోసం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఉద్యోగాలిస్తామని ట్రాప్ .. ఆ సందేశాలకు స్పందిస్తే అంతే సంగతి
ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతికే వారిని టార్గెట్ గా చేసుకుని, వారి ఉద్యోగ అవసరాలను ఆసరాగా చేసుకుని, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి, నిదానంగా ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వేర్వేరు వెబ్సైట్లలో ఉద్యోగాల కోసం రిజిస్టర్ అయిన నెంబర్లను సేకరించి, ఆయా నెంబర్లకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను పంపుతున్నారు. తనకు నిజంగా ఉద్యోగం వస్తుందని ఆశపడి ఏ నిరుద్యోగి అయినా అవతలి వ్యక్తి పంపిన సందేశానికి స్పందిస్తే, ఇక అక్కడి నుండి నిదానంగా వారిని ట్రాప్ చేసి వారి వద్ద నుండి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఫార్మాలిటీ ఛార్జీలు .. కట్టారా మోసపోయినట్టే
మీకు ఫలానా కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది. జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి అంటూ పంపించిన సందేశాన్ని చూసి నిజంగానే ఉద్యోగం వచ్చింది అనుకుని, అమాయకంగా నమ్మి ఇక వారి చెప్పింది ఫాలో అయితే, ఫార్మాలిటీ ఛార్జీల కింద డబ్బులు పంపించాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెడతారు. ఇక భారీ ప్యాకేజీలను చెప్పి, ఫలానా సంస్థలో , ఫలానా ఉద్యోగం అంటూ నిజంగానే ఉద్యోగం ఇచ్చినంత పని మాటల్లో చేసేస్తారు.
ఫార్మాలిటీ ఛార్జీలు చెల్లిస్తేనే జాబ్ .. డబ్బులు చెల్లించి మోసపోతున్న నిరుద్యోగులు
ఆపై నిదానంగా సదరు నిరుద్యోగిని ఈ చార్జీలు చెల్లిస్తేనే ఉద్యోగం కన్ఫామ్ అవుతుందని, వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. ఇది నిజం అనుకొని నమ్మి కొందరు ఫార్మాలిటీ ఛార్జీల కింద డబ్బులు సైబర్ నేరగాళ్లకు చెల్లిస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త వహించాలని, ఆన్లైన్లో ఉద్యోగం వెతుకుతున్న వారు అనుమానాస్పదంగా వస్తున్న సందేశాలు విషయాలను స్పందించకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ బ్యాంకు డీటెయిల్స్ డేటా ఎవరికీ ఇవ్వకూడదని చెప్తున్నారు.
అపరచిత వ్యక్తులు చెప్పేది నమ్మకండి.. డబ్బులు ఇవ్వకండి
ఎవరైనా డబ్బులు పంపించమని అడిగితే, అపరిచిత వ్యక్తులకు డబ్బులు పంపించకూడదని సలహా ఇస్తున్నారు. ఇక అలా ఫార్మాలిటీ ఛార్జీలను వసూలు చేసిన తర్వాత సదరు సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తికి మళ్లీ టచ్ లోకి రారు. దీంతో మోసపోయామని గుర్తించడం సదరు నిరుద్యోగుల వంతవుతుంది. అందుకే సైబర్ మోసగాళ్ళ పట్ల బి అలర్ట్ అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
సైబర్ మోసాలకు గురయితే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చెయ్యండి
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా జరిగిన నష్టాన్ని పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగిన నేటి రోజుల్లో, పెరిగిన టెక్నాలజీతో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పదేపదే సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.