Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో మిచౌంగ్ తుఫాను ప్రభావం.. అపార పంట నష్టం; ఏ జిల్లాలో ఎలా ఉందంటే!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిచౌంగ్ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాను తెలంగాణ రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలకు అపారమైన నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా పత్తి, మిర్చి, వేరుశనగ, కొనుగోలు కేంద్రాల వద్ద కుప్ప పోసిన ధాన్యం తడవడంతో అపార నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు.

మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉంది. నిన్నటి నుండి జోరుగా అనేక ప్రాంతాలలో వర్షం కొనసాగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో కోత కోసి కల్లాల్లో ఉంచిన ధాన్యం, కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. వైరా, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి తదితర మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Cyclone Michaung Impact on Telangana.. Huge crop damage in many district!!

కాత దశలో ఉన్న మిర్చి తోటలు ఈ వర్షంతో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సాగర్ ఎడమ కాలవ కింద ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. దాంతో పలుచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసింది. రైతులు తమ ధాన్యం రాసులపై పట్టాలు కట్టారు. భారీవర్షాలతో కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షంతో జనజీవనం స్తంభించింది.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎమ్మెల్యే, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా వర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.

వరంగల్ జిల్లాలో మిగ్ జాం తుఫాను ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలిగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24.4 మిల్లీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదయింది. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ మండలాలలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కాగా, వరంగల్, ఖిల్లా వరంగల్, గీసుకొండ, సంగెం మండలాలలో తేలికపాటి వర్షపాతం నమోదయింది.

ఈ క్రమంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు పంట తీసుకుని వస్తున్న రైతులు పంట తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పంట తీసుకువస్తే మంచిదని మార్కెట్ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.తడిసిన పంటను తీసుకువచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+