అదుపుతప్పి బోల్తా పడ్డ డీజిల్ ట్యాంకర్: పట్టుకునేందుకు ఎగబడ్డ స్థానికులు
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం ఒంటిమామిడి చెట్టు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో లీక్ అవుతున్న డీజిల్ను పట్టుకునేందుకు స్ధానికులు ఎగబడ్డారు.
హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఒంటిమామిడి చెట్టు గ్రామ శివారులోని మలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్లో ఉన్న 12వేల లీటర్ల డీజిల్ నేల పాలైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు డీజిల్ను పట్టుకునేందుకు బిందెలు, క్యాన్లు తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్కు, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విషం తాగి యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాలలో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కండెల రాజు(20) చదువు పూర్తై ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు
నిజామాబాద్ జిల్లా బాల్గొండ మండలం నాగ్పూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామంలో కబ్జాకు గురైన పశువుల మంద భూమిని వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications