జాతిపిత.. బూతుపిత.. ఈ పితలాటకం ప్రజలకెందుకు?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జాతిపిత, బూతు పిత అన్న వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. అసలు రాజకీయాలలో ఇటువంటి వాతావరణం ఏ ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది జనాలందరూ ఆలోచిస్తున్న అంశం.
కేసీఆర్ తెలంగాణ జాతిపిత, రేవంత్ రెడ్డి తెలంగాణ బూతు పిత
ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజాసంక్షేమం కోసం పని చేస్తామని చెప్పి వచ్చిన నేతలు ఆ పని మరిచిపోయి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం వ్యక్తిత్వ హననం చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ జాతిపిత, రేవంత్ రెడ్డి తెలంగాణ బూతు పిత అంటూ సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి స్టేషన్గన్పూర్ శివుని పల్లిలో జరిగిన సభా వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్రవ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ జాతిపిత ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. జాతిపిత అంటే అందరికీ ఆదర్శంగా ఉండేవాడని, స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆశ్రమాలలో జీవించి త్యాగాలు చేసిన ఆ జాతిపిత ఎక్కడ ఈ జాతిపిత ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుందని వ్యాఖ్యలు చేశారు.
మందు వాసన లేనిదే నిద్ర లేవనోడు జాతిపిత ఎలా?
మందు వాసన లేనిదే నిద్ర లేవనోడు జాతిపిత ఎలా అవుతాడు అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నో, ప్రొఫెసర్ జయశంకర్ నో జాతిపిత అవుతారు కానీ అబద్దాలు చెప్పే వాళ్ళు, టీవీలు, పేపర్లు పెట్టుకొని లక్షల కోట్లు దోచుకునే వాళ్ళు, వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నవాళ్లు జాతిపిత ఎట్లా అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రెండు పార్టీలు మాట్లాడేది బూతు పురాణమే అంటున్న బీజేపీ
ఇక వీరిద్దరి గొడవ ఇలా ఉంటే రెండు పార్టీలు మాట్లాడేది బూతు పురాణం అని అంటూ బిజెపి నేతలు అంటున్నారు. అయితే ప్రజలు ఈ పార్టీల తీరును ఏమనాలో అర్థం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు జాతిపిత ఎవరు బూతు పిత అయితే తమకేంటి ? ప్రజా సమస్యలను పట్టించుకునే నాధుడే లేడా అని వాపోతున్నారు.
తెలంగాణాలో ప్రస్తుత సమస్యలు
తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం సమీపిస్తుంటే రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న దానిపైన, అప్పుడే కరెంటు కోతలు మొదలవుతున్న వేళ ప్రజలను పవర్ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఏం చేయాలి అనే దానిపైన ఫోకస్ లేకుండా రోడ్డుకెక్కి బూతులు తిట్టుకోవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు? ఇందుకేనా మేమంతా ఓట్లు వేశామని ప్రజలు నిలదీస్తున్నారు.
లీడర్స్ ఇకనైనా వేకప్
ఇప్పటికైనా అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం పైన దృష్టి సారించాలని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, ప్రభుత్వం ప్రజా సమస్యల కోసం పనిచేసే లాగా మాత్రమే ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. జాతిపిత బూతు పిత అంటూ మీ రాజకీయాల కోసం చేసే ఈ పితలాటకం మాకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. లీడర్స్.. ఇప్పటికైనా వేకప్..












Click it and Unblock the Notifications