దేశంలో కరోనా కట్టడికి కేంద్రం శ్రమిస్తోంది.!కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చనందుకు డీకే అరుణ దీక్ష.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బుదవారం దీక్ష చేపట్టబోతున్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ స్పష్టం చేసారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎలాంటి సాయమన్నా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అనేక అంశాల్లో అది రుజువయ్యిందని అరుణ తెలిపారు. కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోందని ఘాటుగా విమర్శించారు.
అయినా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్డెసివిర్, వెంటిలేటర్ల వంటి వైద్య సదుపాయాలను భారీగా అందజేసిందని తెలిపారు. పేద ప్రజలకు కోవిడ్ చికిత్స భారం నుంచి 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయలేకపోవడం శోచనీయమన్నారు అరుణ.

అంతే కాకుండా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్ తో బుదవారం జరిగే గరీబోళ్ల కోసం బీజేపీ దీక్షను విజయవంతం చేద్దామని అరుణ పిలుపునిచ్చారు. ఎవరింట్లో వాళ్లు కోవిడ్, లాక్డౌన్ నిబంధనలకు లోబడి దీక్ష చేయాలని విజ్ఞప్తి చేసారు.
మీడియా, సోషల్ మీడియా, వర్చువల్ మీడియా ద్వారా దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ కళ్లు తెరిపించాలని బీజేపి శ్రేణులకు డీకే అరుణ పిలుపునిచ్చారు. బుదవారం ఒక్కరోజు ఎన్ని పనులున్నా వాయిదా వేసుకుని దీక్షలో పాల్గొనాలని సూచించారు. బీజేపి చేసే దీక్ష వల్ల కరోనాతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని స్పష్టం చేసారు. బీజేపి కార్యకర్తలే కాకుండా నాయకులు కూడా ఈ దీక్షలో పాల్గొనాలని అరుణ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications