తెలంగాణ వైద్యుల తీరు ఇదీ: దవాఖాన బయటే ప్రసవాలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునే మహిళలకు, వారి నవజాత శిశువుల కోసం పౌష్టికాహారం కోసం ‘కేసీఆర్ కిట్’ పంపిణీ చేస్తున్నామని సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది.
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఆసుపత్రుల్లో వసతులు కల్పించేందుకు పూనుకోలేదు.. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాల ఏర్పాటుకే పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని పదేపదే ప్రకటిస్తున్నారు. ఇక వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి నిరంతరం రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను సందర్శిస్తూ పనితీరును పర్యవేక్షిస్తుంటారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునే మహిళలకు, వారి నవజాత శిశువుల కోసం పౌష్టికాహారం కోసం 'కేసీఆర్ కిట్' పంపిణీ చేస్తున్నామని సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. కానీ సిబ్బంది నిర్లక్ష్యమో.. వైద్యుల పట్టింపులేని తనమో.. కారణాలేమైనా.. తెలంగాణలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రులు ఇబ్బందికర ఘటనలకు వేదికగా మారుతున్నాయంటే అతిశేయోక్తి కాదు.
నిండు నెలలతో వచ్చే గర్భిణులకు ప్రసవం తేదీ ఎప్పుడు వస్తుందో చెప్పలేని స్థితిలో వైద్యులు ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరేందుకు వచ్చిన నిండు చూలాలు వార్డు బయటే ప్రసవించింది.
అలా కింద పడటంతో నవజాత శిశువు వెంటనే కన్నుమూసింది. ఈ ఘటన తర్వాత కూడా ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది, వైద్యుల పనితీరులో మార్పు కానరాలేదనడానికి తాజాగా మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. కనుక తగు చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న సీఎం కేసీఆర్ సూచించినా ఆసుపత్రుల యాజమాన్యాలు, వాటిల్లో పని చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అంబులెన్స్ కోసం చూస్తుండగానే ప్రసవం
మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆసుపత్రులకు వచ్చిన మహిళలకు ఆరుబయటే ప్రసవాలు జరిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు శివారు బాదావతు తండా వాసి వినోద అనే గర్భిణి సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రాంతీయ ఆసుసుపత్రికి వచ్చింది. సోమవారం రాత్రి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యురాలు పూర్ణిమ ఆమెను పరీక్షించి ఇంకా నెలలు నిండలేదని, బీపీ కూడా ఎక్కువగా ఉందని వరంగల్కు తీసుకెళ్లాలని సిఫారసు చేశారు.
దీంతో భర్త హుసేన్ ఆమెను బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ కోసం వెతుక్కుని.. దానిని ఎక్కించే క్రమంలోనే వినోదకు నొప్పులు ఎక్కువై ప్రసవం జరిగిపోయింది. శిశువు ఒక్కసారిగా నేలపై పడిపోయింది. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి ఆసుపత్రిలోకి తీసుకువెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. నొప్పులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోలేదని వినోద భర్త, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు చూసిన వైద్యులు ఆమెకు వచ్చేనెల 24వ తేదీన కాన్పు అవుతుందని సూచించారని, నెలలు తక్కువగా ఉండటం, బీపీ ఎక్కువగా ఉండటంతో వరంగల్కు సిఫారసు చేశానని మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ వివరణ ఇచ్చారు.
ఇందూరులో లిఫ్ట్ వద్దే ప్రసవం
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గుండారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాం నగర్ మహిళ శిల్ప ఆసుపత్రి లిఫ్ట్ వద్దే బిడ్డను ప్రసవించింది. శిల్పకు నెలలు నిండడంతో తండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు గంటలపాటు ఆమె లైనులోనిలబడిన తర్వాత వైద్యనిపుణురాలు పరీక్షించి రక్తపరీక్ష, స్కానింగ్ చేయించుకురావాలని చెప్పారు. అప్పటికే వైద్యంకోసం, తర్వాత పరీక్షల కోసమని తిరిగిన ఆమె ఉదయం నుంచి సాయంత్రంవరకు గంటల తరబడి నిలబడి తీవ్రంగా అలిసిపోయింది.
వైద్య పరీక్షల నివేదికలన్నీ పట్టుకుని సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి లిఫ్ట్ వద్దకు చేరుకోగానే నొప్పులు మొదలై అక్కడే కుప్పకూలి పోయింది. ఆమెకు తోడుగా వచ్చిన తండ్రికి ఏంచేయాలో తోచలేదు. పెద్దగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న మహిళలు వచ్చి చుట్టూచేరి ఆమెకు రక్షణగా నిలబడ్డారు. అప్పటికే శిల్ప నేలపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన సిబ్బంది పరుగెత్తుకొచ్చి శిల్పను, బిడ్డను వార్డుకు తీసుకెళ్లారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములును వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, వివరాలు తెలుసుకుంటానని చెప్పారు.