మద్యం షాపులో బోనీ చేశా! చలానా వద్దు, సెల్ఫీలు..: డ్రంక్అండ్డ్రైవ్లో యువకుడి వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో పోలీసులకు చిక్కిన ఓ యువకుడు వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. తనకు చాలానా వద్దు, తనను ఫొటోలు తీయొద్దు.. తనకు సెల్ఫీలు కావాలంటూ ట్రాఫిక్ పోలీసులకే చుక్కలు చూపించాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రోహిత్ అనే యువకుడు శుక్రవారం ఉదయం తప్పతాగి బైక్ నడుపుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం నుంచి వస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రోడ్డు మీద మెలికలు తిరిగుతూ వస్తున్న రోహిత్ బైక్ను గుర్తించారు.
వెంటనే రోహిత్ను ఆపి, బైక్ దించి బ్రీత్ ఎనలైజర్తో పరీక్షకు యత్నించారు. అయితే, అతడు మాత్రం దానికి అంగీకరించకుండా.. ఎంత కావాలి? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. దీంతో పోలీసులు షాకయ్యారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్ దగ్గర మద్యం షాపు తెరిస్తే బోనీ చేసి వస్తున్నానంటూ పోలీసులకు చెప్పాడు.
తన బైక్ను, తనను ఫొటో తీయకుండా అరగంటపాటు రోహిత్ పోలీసులను ఇబ్బంది పెట్టాడు. చివరకు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసిన పోలీసులు, అతని బైక్ను ఫొటోలు తీశారు. తనకు చాలానా వద్దు.. సెల్ఫీలు కావాలంటూ ట్రాఫిక్ పోలీసులతో రోహిత్ సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత అతడ్ని తమ వెంట తీసుకెళ్లారు.