MLC Kavitha లేఖపై స్పందించిన ఈడీ.. విచారణ అప్పుడే!!
అంతా ఉత్కంఠగా చూసిన కవిత లేఖపై ఎట్టకేలకు ఈడీ స్పందించింది. తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ఈడి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనలు రేపింది. ఒకవైపు 10వ తేదీన మహిళా బిల్లు అంశంపై కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరపాలని నిర్ణయం తీసుకోగా దానికి సరిగ్గా ఒక్కరోజు ముందు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కవితకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఒక్కరోజు వ్యవధిలోనే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కవిత విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ
అయితే తాను ఈనెల 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఈడి జాయింట్ డైరెక్టర్ కు కవిత లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వడంతో ఈడీ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠ రేపింది. తాజాగా కవిత చేసిన విజ్ఞప్తికి ఈడీ స్పందించింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ కవిత విజ్ఞప్తి మేరకు ఈనెల 11వ తేదీన శనివారం నాడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దీంతో ఈడీ విచారణ పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా.. ఆపై..
కాగా ఇప్పటికే ఈనెల 10వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని పేర్కొన్న కవిత ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశాన్ని నిర్వహించి కీలకంగా మాట్లాడనున్నారు. జంతర్ మంతర్ వద్ద దీక్షలో పాల్గొనే మరుసటి రోజు ఈడీ ఆఫీసులో కవిత హాజరుకానున్నారు. ఇక శనివారం ఈడీ ముందు హాజరుకానున్న నేపథ్యంలో కవిత ఈడి అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారు? ఏం సమాధానం చెప్పాలి? అన్న దానిపైన మానసికంగా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కుట్రలో భాగంగానే నోటీసులు .. బీఆర్ఎస్ ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దూకుడుగా ముందుకు వెళుతున్న ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను విచారణ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇదంతా కేసీఆర్ పై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక దానికి కౌంటర్ ఇస్తూ బిజెపి నాయకులు తమదైన శైలిలో బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.

లీగల్ ఒపీనియన్ తీసుకుని మందుకు సాగుతున్న కవిత
ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో కవితను టార్గెట్ చేస్తూ ఈడి వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారగా, ఏం జరిగినా సరే పోరుబాట వదిలేది లేదని, కేంద్రం ముందు తెలంగాణా తలవంచదని బీఆర్ఎస్ నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో ఈ కేసు విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని కవిత ముందుకు సాగుతున్నట్టు సమాచారం. మరి ఈరోజు మధ్యాహ్నం కవిత మీడియా సమావేశం నిర్వహించనున్న క్రమంలో ఏ అంశంపై మాట్లాడతారు. ఈ కేసు విషయంలో ఆమె ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా అన్నది అందరిలో ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications