30రూపాయల కూలీతో బ్రతికేదెలా? రోడ్డుపై బైఠాయించి ఉపాధి కూలీల మెరుపు ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపాధిహామీ కూలీలు రోడ్డెక్కారు. పనులను బహిష్కరించి రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడినా చాలీచాలని కూలీతో జీవితం ముందుకు సాగటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసేచోట కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ మండిపడ్డారు. కనీస ధర కూడా ఇవ్వకుండా రోజుకు 30 రూపాయల నుండి 70 రూపాయల లోపు మాత్రమే తమకు కూలి ఇస్తున్నారని ఆందోళన బాట పట్టారు.
భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఉన్న పెద్దమ్మకుంట వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులు బహిష్కరించి కూలీలు ధర్నా చేపట్టారు. ములుగు పరకాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఎర్రటి ఎండలో ఆరుగాలం కష్టపడినా తమకు ఇచ్చే కూలీ సరిపోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో రోజువారీ కూలీ 30 రూపాయల నుండి 70 రూపాయల లోపు ఉండటం తమకు ఇబ్బందిగా మారిందని ఉపాధి హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని వారు చెప్తున్నారు. ఇక అదే విధంగా ఉపాధిహామీ కూలీలు పనులు చేసే ప్రాంతాలలో కనీస వసతులు కల్పించడం లేదని, కనీసం త్రాగడానికి నీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతూ పనులు చేస్తున్నామని చెప్తున్నారు. పనులు చేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రధమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉండటం లేదని ఉపాధి హామీ కూలీలు వాపోయారు. కనీస సౌకర్యాల పై అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తాము ఆందోళన బాట పట్టామని వెల్లడించారు. సంబంధిత శాఖ అధికారులు కనీసం ఫీల్డ్ మీదికి రావడం లేదని వారు చెప్పారు. కేవలం 30రూపాయల వేతనంతో జీవనం సాగించేదెలా అంటూ ప్రశ్నించారు. ములుగు పరకాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.