తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు: సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి.
ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది.
కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా.. యాజమాన్యాలను ఏఎఫ్ఆర్సీ అధికారులు పిలిపించి చర్చించారు. ఆ సందర్భంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను ఏఎఫ్ఆర్సీ రిజిస్టర్లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ ఆగస్టు నెల 1న ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోక ముందే.. ఆగస్టు నెల 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఏఎఫ్ఆర్సీ ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలు అనుమతించాలని కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతో ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఫీజులను వసూలు చేసేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్ పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సీబీఐటీలో లక్ష 75వేలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో లక్ష 55వేలు, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో లక్షన్నర, ఎంవీఎస్ఆర్లో లక్ష 45వేలకు చేరింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫీజు ఎంత మేర పెరిగిందనే వివరాలను కౌన్సెలింగ్ సమయంలో అధికారులు వెల్లడించక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 13 వరకు ఆన్ లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఇలావుండగా, ఫీజు రీఎంబర్స్మెంట్ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం కోసం బీసీ, ఈసీబీలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, గురుకులాల్లో చదివిన వారితో పాటు 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులందరికీ పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం 35వేల రూపాయలు మాత్రమే రీఎంబర్స్ మెంట్ ఇస్తుండగా.. మిగతా ఫీజు విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 35 వేలు వసూలు చేసే కాలేజీలు ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇతర కాలేజీల్లో ఇంతకుమించే ఫీజులు వసూలు చేస్తున్నారు.