హెచ్సీయూలో ఆఫ్లైన్లోనే ప్రవేశ పరీక్షలు, ఆన్లైన్లో తరగతులు: వీసీ
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది.
హెచ్సీయూ ప్రవేశ పరీక్షలు గత సంవత్సరం మాదిరిగానే ఆఫ్లైన్లోనే పెన్ను, పేపర్ విధానంలో ఉంటాయని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 38 కేంద్రాల్లో మూడు దశల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పరీక్షకు రెండు గంటల వ్యవధి ఉంటుందని వీసీ వివరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నట్లు అప్పారావు తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్తాయిలో అత్యధికంగా 65వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
నవంబర్ 1 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆ తర్వాత తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు వీసీ అప్పారావు స్పష్టం చేశారు. అంతేగాక, ఆగస్టు 20 నుంచి ఆన్లైన్ తరగతులతో పీజీ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 2300 మంది పీజీ విద్యార్థులు గురువారం నుంచి ఆన్లైన్ తరగతులకు హాజరవుతారని చెప్పారు.
ఈ ఏడాది చివరి నాటికి ఆన్లైన్ సెమిస్టర్ పూర్తి చేయనున్నట్లు వీసీ అప్పారావు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో సెమిస్టర్ నమోదు చేసుకోవాలని సూచించారు. సెమిస్టర్ ఫీజులు ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదని వీసీ తెలిపారు. సిలబస్, పరీక్షలు, మార్కుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని వీసీ అప్పారావు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. పరీక్షలు నిర్వహించేందుకు కూడా సిద్ధయ్యాయి.
టాప్-10లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
ఇది ఇలావుంగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో స్థానం సంపాదించింది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు సంబంధించి అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ ఆన్ ఇన్నోవేషణ్ అచీవ్మెంట్స్(ఏఆర్ఐఐఏ)-2020 ర్యాంకింగ్స్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాప్-5లో నిలిచినట్లు వర్సిటీ పీఆర్వో ఆశీష్ జెకాబ్ తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తొలి స్థానంలో నిలవగా, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.