ఎన్ని కేసులు పెట్టినా భయపడం: రేవంత్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు ఛాన్స్
కొడంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం నాడు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్లోని యువనేత రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను కలిశారు.
ఎర్రబెల్లి దయాకర రావుతో పాటు పలువురు రేవంత్ను కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యేలను అదికారం, డబ్బుతో ప్రలోభ పెట్టి టిఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అలా రాని వారిని కేసులతో బెదిరిస్తున్నారన్నారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. టిడిపి స్థానిక నేతలను కాంట్రాక్టుల ఆశలు చూపి చేర్చుకుంటుందని మండిపడ్డారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో టిడిపి గెలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పారు. రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశాన్ని కోర్టు ద్వారా అనుమతి తీసుకుంటామని చెప్పారు.