బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణాతో బంధం తెగిపోయింది: ఈటల రాజేందర్ సంచలనం
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి గా మారిన నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో ప్రజాగోస - బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణాను దిద్దలేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తాడా? ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తా అంటున్నాడని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పదాన్ని రద్దు చేసుకొని బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతోనే కెసిఆర్ కి తెలంగాణా కు ఉన్న బంధం తెగిపోయిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలు మరోమారు సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని నిరూపించాయని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్క దోవ పట్టిస్తుందని ఈటల రాజేందర్ విమర్శించారు.

కేసీఆర్ మునుగోడులో విజయం చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు ఉంది
కేసీఆర్ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపికి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. మునుగోడులో కేసీఆర్ విజయం సాధించానని అనుకుంటున్నాడు కానీ ఆ విజయం ఏ పాటిదో అందరికీ తెలుసన్నారు. మునుగోడులో వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా .. వేలాది హామీలు ఇచ్చినా, మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిష్ట వేసి కూర్చున్నా చావుతప్పి కన్నులోట్ట బోయిన చందంగా గెలిచామనిపించుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కానీ అక్కడ మాత్రం ధర్మమే గెలిచిందని, రాజగోపాల్ రెడ్డి మాత్రమే గెలిచారని ఆయన పేర్కొన్నారు.

సజ్జల, కేసీఆర్ కలిసే ఈ కుట్రలు... తెలంగాణా సెంటిమెంట్ కోసమే
తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని పేర్కొన్న ఈటల రాజేందర్, నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామానికి ప్రజా గోస బిజెపి భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. టిఆర్ఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడబలుక్కునిమళ్లీ తెలంగాణ సెంటిమెంటును లేవనెత్తుతున్నారన్నారు. ప్రజలెవరూ దీన్ని నమ్మరు అని, కచ్చితంగా తిప్పికొడతారని పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంటుతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని, అటువంటి ప్రయత్నం చేసిన విఫలమవుతారు అంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications