చేసిన తప్పులవల్లే మోడీ ముందుకు కేసీఆర్ రావట్లేదు; వామపక్ష నాయకులకు ఈటల రాజేందర్ చురకలు!!
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ని ప్రారంభించి జాతికి అంకితం చేయాలని వస్తున్న క్రమంలో, ప్రధాని పర్యటన పై టిఆర్ఎస్ పార్టీ, వామపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ప్రధాని పర్యటనను అద్దుకుని తీరతామని అంటున్నారు.
ప్రధాని పర్యటనపై రగడ
ఏడాది క్రితం ఉత్పత్తి ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రధాని ప్రారంభించాల్సిన అవసరం ఏముంది అని టీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిన ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి రావడానికి వీలు లేదని మండిపడుతున్నారు. ఇక టిఆర్ఎస్, వామపక్ష పార్టీలకు బిజెపి నాయకులు చురకలు అంటిస్తున్నారు. ప్రధాని పర్యటన పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఏవైనా అవాంచనీయ ఘటనలు జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా టిఆర్ఎస్ వామపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారని, ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రధాన నరేంద్ర మోడీ పర్యటన లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాయమాటలు నమ్మకండి అంటూ వామపక్షాలకు ఈటల సలహా
ప్రధాని సభను అడ్డుకోవడానికి కెసిఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం నాయకులను ముందు పెట్టి కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక వామపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి మాట్లాడిన ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయ మాటలు నమ్మొద్దు అంటూ సూచించారు. కెసిఆర్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ హెచ్చరించారు. ఒకనాడు కమ్యూనిస్టు పార్టీలు లేవని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు కమ్యూనిస్టు నాయకులు వెంటపెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తో కలిసి నడిస్తే మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటారు
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన కారణంగానే తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా కెసిఆర్ అణిచివేతకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సకాలంలో రైతులకు ఎరువులు అందించాలన్న ఉద్దేశంతోనే కేంద్రం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కట్టిందని, దానిని ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ చేయడానికి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. చేసిన తప్పుల వల్ల కెసిఆర్ మోడీ ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కెసిఆర్తో కలిసి నడిస్తే సిపిఐ సిపిఎం పార్టీలను కూడా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.