మునుగోడులో సామాజికవర్గాల వారీగా ఓట్లకోసం పార్టీల కసరత్తు.. గెలుపును నిర్ణయించే ఓటర్లు వీరే!!
మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసారి తమ సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చూస్తున్నాయి.

అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మునుగోడు నియోజకవర్గంలో తమ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుండే రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి కసరత్తులు మొదలు పెట్టాయి.

సామాజిక వర్గాల వారీగా ఓటుబ్యాంకుపై కసరత్తులు
సామాజిక వర్గాల వారీగా మునుగోడు నియోజకవర్గంలో ఓటుబ్యాంకు అధ్యయనం చేస్తున్న రాజకీయ పార్టీలు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఎవరి ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ ఎస్టీల ఓటుబ్యాంకు ఎంత? అభ్యర్థిగా ఎవరిని నిలబడితే తమ పార్టీ విజయం సాధిస్తుంది? ఏ కమ్యూనిటీకి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉంది? వంటి అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై మంది ఉంటే కులాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు అన్న డేటాను సైతం సేకరించి పని మొదలుపెట్టారు.

మునుగోడులో అత్యధిక ఓటర్లు ఈ కమ్యూనిటీనే. ఈ మూడు కులాల ఓట్లే కీలకం
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా గౌడ కులస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ కులస్తులు 35,150మంది 15.94% ఓటు షేర్ తో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ముదిరాజులు 33, 900 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ముదిరాజు ఓటు పర్సంటేజ్ 15.3 7 శాతంగా ఉంది. ఇక మూడవ స్థానంలో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది మునుగోడు నియోజకవర్గం లో ఎస్సీ మాదిగ ఓటర్లు 25 ,650 మంది ఉన్నారు. ఓటు శాతం 11.6 3 శాతం.

కులాల వారీగా ఓటు బ్యాంకు వివరాలివే
యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు 21, 360 మంది కాగా వారి ఓటు షేర్ 9.69 శాతంగా ఉంది. ఇక పద్మశాలీలు 11, 680 ఉన్నారు. వారి ఓటు శాతం 5.30 శాతంగా ఉంది. ఎస్టి లంబాడి ఎరుకల కులానికి చెందిన ఓటర్లు 10,520 మంది ఉన్నారు. వారి ఓటు శాతం 4.7 శాతంగా ఉంది ఇక ఎస్సీ మాల 10,350 మంది ఓటర్లు, వడ్డెర కమ్యూనిటీ చెందిన 8,350 ఓటర్లు, కుమ్మరి కమ్యూనిటీలో 7,850 మంది ఓటర్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ లో 7,820 ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీ లో 7,690 మంది ఓటర్లు, ముస్లింలు 7,650 మంది, కమ్మ 5,680 మంది, ఆర్య వైశ్య కమ్యూనిటీ ఓటర్లు 3,760 మంది, వెలమ ఓటర్లు 2,360 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది, ఇతరులు 18,400 మంది ఉన్నారు.

అభ్యర్థి ఎంపికలోనూ సామాజిక వర్గ ఓటర్ల గణన.. ప్రభావంపై అంచనా
ఇక కులాల వారీగా ఓటు బ్యాంకు ను పరిశీలిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు, ఏ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నదానిపై అంచనా వేస్తున్నారు. ఆ కమ్యూనిటీ నుండి బలమైన నాయకుడు ఎన్నికల బరిలోకి దింపాలని ఎత్తుగడ వేస్తున్నారు. ఏది ఏమైనా సామాజిక సమీకరణాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే అన్ని ప్రధాన పార్టీల నాయకులు ఈసారి మునుగోడు ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications