ఖమ్మంలో మీరిచ్చిన వాగ్దానాలపై వివరణ ఇచ్చి సభ పెట్టుకోండి: కేసీఆర్కు వైఎస్ షర్మిల ప్రశ్నాస్త్రాలు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మం వేదికగా అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. కేంద్రంలోని బిజెపికి షాక్ ఇచ్చేలా, దేశంలోని ప్రతిపక్షాలు అన్నింటిని ఐక్యవేదిక మీదకు తీసుకు వచ్చేలా సీఎం కేసీఆర్ నేడు సభ నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ సభ పైన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఖమ్మం గడ్డ పైన అడుగు పెట్టే ముందు అక్కడ ప్రజలకు కెసిఆర్ చేసిన అమలుకాని 10 వాగ్దానాలపై వివరణ ఇవ్వాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పట్ల ఆయన పాలన ఎంత దారుణంగా ఉందో గుర్తు చేస్తూ వైయస్ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం
సీఎం కేసీఆర్ కు తనదైన శైలిలో ప్రశ్నాస్తాలు సంధించిన వైఎస్ షర్మిల జిల్లాకు సంబంధించిన అనేక వైఫల్యాలపై కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు మండలాల విలీనానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు సుదీర్ఘ యుద్ధం చేయలేదు? అని ప్రశ్నించిన షర్మిల పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తహతహలాడుతున్న మీ ప్రభుత్వం సమస్యను ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? అంటూ నిలదీశారు.

భద్రాచలం ఆలయ అభివృద్ధి హామీ ఏమైంది? సీతారామ ప్రాజెక్ట్ మాటేంటి?
భద్రాచలం ఆలయాన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని 2016 ఏప్రిల్ లో కేసీఆర్ ప్రకటించారని, ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజు వరకు ఎందుకు భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ప్రశ్నించిన షర్మిల సమాధానం చెప్పాలన్నారు. భద్రాచలం రక్షణకు హామీ ఇచ్చిన 1000 కోట్లు ఎక్కడివి? పనుల్లో పురోగతి ఎందుకు లేదు చెప్పాలని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ఎన్నో ప్రకటనలు గుప్పించిన సీతారామ ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని వైయస్ షర్మిల ప్రశ్నించారు. గత సంవత్సరం ఖమ్మం జిల్లాలో వరదలు విధ్వంసం సృష్టించాయని, వరద సహాయం అందించడం పట్ల, పరిహారం ఇవ్వడం పట్ల కేసీఆర్ ఉదాసీన వైఖరికి కారణమేమిటని వైయస్ షర్మిల నిలదీశారు.

ఖమ్మం జిల్లా రైతులు, పోడు రైతుల మాటేంటి?
ఖమ్మం జిల్లాలో పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, గిరిజనుల పోడు భూముల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్, బిజెపిల మధ్య సాగుతున్న డ్రామా ఎప్పటికి ముగుస్తుందంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తో పెద్ద సంఖ్యలో జిల్లా రైతులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఖమ్మం జిల్లారైతుల సమస్యలను పరిష్కరించడానికి మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు.

గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం నుండి ఎలా గట్టెక్కిస్తారు? సమాధానం చెప్పండి
ఖమ్మంలో చాలా ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీలపై మీ వైఖరి ఏంటో తెలియజేయాలన్నారు. కెసిఆర్ అసమర్ధ పాలన వల్లే ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. జిల్లాలో మిర్చి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అందుకు కారణాలు ఏమిటో కేసీఆర్ చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లా ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేసినందుకు, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఖమ్మం గడ్డపై అడుగుపెట్టే ముందు కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications