ఐటీ అధికారులమని చెప్పి లాకర్ తాళాలు తీసుకుని దర్జాగా దోచుకెళ్ళిన కేటుగాళ్ళు.. లబోదిబోమన్న బాధితులు
సమాజంలో నేరప్రవృత్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అని భావిస్తున్న చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు బాగా చదువుకుని సైబర్ నేరాలకు పాల్పడుతుంటే, మరికొందరు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అధికారుల మని చెప్పి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఇక తాజాగా ఐటి అధికారుల మని చెప్పి దర్జాగా ఇంటికి వెళ్లి దోపిడీకి పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఐటీ అధికారులమని పట్టపగలే దర్జాగా దోపిడీ
ఐటీ సోదాల పేరుతో నానక్ రామ్ గూడా లోని జయభేరి ఆరంజ్ కౌంటీలోకి పక్కా ప్లాన్ ప్రకారం ఐదుగురు దుండగులు ప్రవేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సి బ్లాక్ లో ఉండే భాగ్య లక్ష్మి అనే మహిళ ఇంట్లోకి వెళ్లిన దుండగులు తమను తాము ఐటీ అధికారులు అని పరిచయం చేసుకున్నారు. దాదాపు గంటన్నర పాటు అదే ఇంట్లో ఉండి వారికి సంబంధించిన అన్ని ఆస్తి వివరాలు సేకరించారు. ఐటీ అధికారుల్లా నటించారు. ఆ తరువాత లాకర్ తాళాలు తీసుకుని, లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మూడు కిలోల బంగారం రెండు లక్షల నగదును సీజ్ చేస్తున్నట్టు డ్రామా ఆడి మరీ ఎత్తుకుపోయారు.
ఐటీ అధికారులు కాదని తెలిసి పోలీసులకు ఫిర్యాదు
తర్వాత ఇంటికి వచ్చింది ఐటీ అధికారులు కాదని వారికి తెలియడంతో లబో దిబోమన్నారు. దుండగుల చేతిలో మోసపోయామని గుర్తించిన బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇంటికి వచ్చిన వారి మాట్లాడిన తీరు అడిగి వారు ఎక్కడి వాళ్ళో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమీప పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించి కేటుగాళ్ళ కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి.
ఇటీవల సీబీఐ అధికారులమని దోపిడీ
మొన్నటికి మొన్న సీబీఐ అధికారుల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టొచ్చు అని భావించిన నలుగురు సభ్యులు సీబీఐ అధికారుల్లా రెడీ అయ్యి కడప జిల్లాలో దోపిడీకి పాల్పడ్డారు. బాగా డబ్బున్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న దుండగులు అధికారుల్లా ఖాజీపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ను టార్గెట్ చేశారు. నకిలీ సి.బి.ఐ ముఠా సభ్యులు ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని విచారణ పేరుతో కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అతని ఆస్తుల వివరాలు, తదితరాలను అడిగి తెలుసుకుంటూ నిందితుడిని అక్కడక్కడ తిప్పుతూ అతని వద్దనుండి 1.14 లక్షల రూపాయలను దండుకున్నారు.
కడపలోనూ మోసపోయిన బాధితుడు, ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు
ఆ తర్వాత ఉదయ్ కుమార్ ను మరుసటి రోజు వదిలిపెట్టారు. తర్వాత నకిలీ సిబీఐ అధికారులని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వీరి వద్దనుండి 84 వేల నగదును, వారు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. కేటుగాళ్ల వద్ద ఉన్న నకిలీ సిబిఐ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి వెల్లడించారు. గతంలో వీరు ఎక్కడెక్కడ నేరాలు చేశారో బయటపెట్టే పనిలో ఉన్నారు.