తస్మాత్ జాగ్రత్త: నకిలీ టీపొడి, షాంపూ, కొబ్బరినూనెలకు బ్రాండ్ స్టిక్కర్లు..నలుగురు అరెస్టు
మీరు టీప్యాకెట్ కొంటున్నారా... రెడ్ లేబుల్ కానీ, త్రీ రోజెస్ బ్రాండ్ టీ ప్యాకెట్ కొంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త... ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ కొనండి. ఎందుకంటే బ్రాండ్ పేర్లు లేదా వాటి స్టిక్కర్లను సాదాసీదా టీ ప్యాకెట్పై అంటించి దాన్ని అధిక ధరకు అమ్ముతున్నారు కేటుగాళ్లు . ఇలా ఒక్క టీప్యాకెట్ మాత్రమే కాదు.. హెయిర్ ఆయిల్, షాంపూలు, ఇంకా చాలా వస్తువులుకు బ్రాండ్ పేర్లు అంటించి యదేచ్ఛగా మార్కెట్లో విక్రయిస్తున్నారు నకిలీగాళ్లు. ఇలాంటి నకిలీ రాకెట్ గుట్టు రట్టు చేసింది హైదరాబాద్ పోలీస్ శాఖ.
నకిలీ వస్తువులకు బ్రాండ్ స్టిక్కర్లు
హైదరాబాద్ నగర పోలీస్ టాస్క్ ఫోర్స్ శాఖ గోషామహల్లోని హిందీనగర్లోని ఓ గోడౌన్లో దాడులు నిర్వహించింది. దాడులు చేసిన పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నకిలీ వస్తువులు తయారు చేసి వాటికి బ్రాండ్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసేవారిని యజమానిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు చేసిన తర్వాత వారిని లోతుగా విచారణ చేశారు పోలీసులు . ఈ తరహా దందా తామొక్కరమే చేయడం లేదని చాలామంది చేస్తున్నారని సమాచారం ఇచ్చారు నిందితులు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జీడిమెట్ల, మేడ్చల్ జిల్లా, చర్లపల్లిలోని గోడౌన్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
నకిలీ వస్తువులు అమ్ముతున్న నలుగురు అరెస్టు
దాడులు నిర్వహించిన పోలీసులు గోడౌన్ల నుంచి నకిలీ టీపౌడరును ప్యాక్ చేస్తుండటం గమనించారు. టీ పొడిని ప్యాక్చేసి వాటికి బ్రాండ్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. వీటిలో చక్ర గోల్డ్, రెడ్ లేబుల్, త్రీ రోజెస్ లాంటి బ్రాండ్ ఉన్న స్టిక్కర్లను నకిలీ టీ పౌడరుకు అంటిస్తున్నారు. అంతేకాదు 175 మిల్లీలీటర్లున్న ఖాలీ బాటిల్లో కొబ్బరి నూనె ప్యాక్ చేసి దానికి పారాచూట్ బ్రాండ్ స్టిక్కర్ అంటించి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అంతేకాదు నకిలీ డిటర్జెంట్ సబ్బులకు ప్రముఖ బ్రాండ్లు అయిన ఏరియల్, టైడ్, సర్ఫ్ లాంటి స్టిక్కర్లు అంటించారు. ఇక షాంపూల సంగతికొస్తే నకిలీ షాంపూలు తయారు చేసి వాటికి హెడ్ అండ్ షోల్డర్స్, క్లినిక్ ప్లస్, సన్సిల్క్ లాంటి బ్రాండ్ల స్టిక్కర్లు అంటించారు. అంతేకాదు బోగస్ విమ్ వాషింగ్ బార్ కూడా అమ్ముతున్నారు. ఈ కేసుకు సంబంధించి పంకజ్ పురోహిత్, రాకేష్ జైన్, మహవీర్ జైన్, గెవార్లను పోలీసులు అరెస్టు చేయగా... మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
బేగంబజార్లో టీపొడి కొనుగోలు..ఢిల్లీ నుంచి బ్రాండ్ కవర్లు కొనుగోలు
గత ఐదేళ్లుగా పురోహిత్ బేగం బజార్లో ఈ నకిలీ మాల్ను సప్లై చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే రాకేష్ అనే వ్యక్తిని కలిసి నకిలీ వస్తువులు అమ్మి మరింత డబ్బు సంపాదించాలని భావించారు. పోలీసులు కాస్త గట్టిగా విచారణ చేయగా నేరాన్ని పురోహిత్ ఒప్పుకున్నాడని తెలిపారు. రాకేష్ తన ఉత్పత్తి కేంద్రాన్ని జీడిమెట్లలో స్థాపించి ప్రముఖ బ్రాండ్లతో ఉన్న టీపౌడర్ స్టిక్కర్లను ఢిల్లీలోని మిశ్రా అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసేవాడు. ఇక బేగం బజార్ నుంచి టీపౌడర్ను కొనుగోలు చేసి తన షాపులో ప్యాక్ చేసి బ్రాండ్ స్టిక్కర్ అంటించి మార్కెట్లకు తిరిగి సప్లై చేసేవాడని పోలీసులు తెలిపారు. వీటన్నిటినీ ఉంచేందుకు హిందినగర్లో ఓ గోడౌన్ను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.
ఆరునెలల క్రితం రాకేష్, పురోహిత్లు తమ దందాను విస్తరించేందుకు చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా అప్పటి వరకు దందా ఒక్క టీపొడికి మాత్రమే పరిమితం కాగా ఆ తర్వాత అది కొబ్బరినూనెకు పాకిందని తెలిపారు. ఇక నకిలీ కొబ్బరి నూనెను రాకేష్ బంధువు మహవీర్ జైన్ చర్లపల్లిలో తయారు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.