బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ: రైతులపై ప్రేమ ఒలకబోస్తూ చేస్తున్న ఆందోళనల మతలబు ఇదేనా!!
తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసమంటూ రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అటు తెలంగాణాలోని అధికార బీఆర్ఎస్ , కేంద్రంలోని అధికార బీజేపీ ఎవరికి వారు తాము రైతుల కోసం పని చేసే ప్రభుత్వాలు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టు రాష్ట్రంలో రాజకీయాలు రైతుల కేంద్రంగా కొనసాగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రైతుల కోసం చేస్తున్న ఆందోళనల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు చర్చ జరుగుతుంది.

బీజేపీని టార్గెట్ చేసి రైతుల కోసం అంటూ బీఆర్ఎస్ రైతుల మహాధర్నా
మొన్నటికి మొన్న బి ఆర్ ఎస్ రైతుల పొలాల్లో నిర్మించిన కల్లాల డబ్బులను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెబుతూ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మహా ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకం నిధులను రైతుల కోసం, పొలాలలో కల్లాలను నిర్మించడం కోసం వినియోగిస్తే ఆ నిధులను తిరిగి ఇవ్వమంటున్నారు అని బీఆర్ఎస్ నాయకులు బిజెపి ని టార్గెట్ చేశారు. తెలంగాణా రైతులను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ ఆందోళనలు.. రైతుల కోసమే అంటూ
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుంటే బీజేపీ తట్టుకోలేకపోతుందని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాష్ట్ర రైతాంగం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఇక బీఆర్ఎస్ నేతలు రైతు మహా ధర్నా నిర్వహించి చేసిన ఆరోపణలను.. తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఆందోళనలు చేపట్టి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఫసల్ భీమా యోజనతో పాటు రైతులకు ఇచ్చిన హామీల కోసం బీజేపీ ఆందోళన
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని, ఉచిత ఎరువులు అందించాలని, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టే యత్నం చేసిన బీజేపీ
కేంద్రం రైతాంగం కోసి ఇచ్చిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా, రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు రైతులకు ఎన్నో ఇబ్బందులను కలుగజేస్తున్న ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బిజెపి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని బీఆర్ఎస్ చేసిన ఆందోళనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య రైతుల పేరుతో పంచాయితీ వెనుక రీజన్ ఇదే
మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులను మధ్యలో పెట్టి బీఆర్ఎస్, బిజెపి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా వచ్చే ఎన్నికల కోసమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . రైతుల ఓటు బ్యాంకు కోసం సాగుతున్న ఈ రాజకీయాలలో రైతులకు తామే మేలు చేస్తున్నాం అని నమ్మించటంలో భాగంగానే ఆందోళనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ పోరులో రైతుల మద్దతు కూడగట్టటంలో ఎవరు సక్సెస్ అవుతారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications