ఆ బిడ్డపై ఘాతుకం తండ్రి పనే, భార్య కూడా ఫిర్యాదు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బట్వారం మండలంలో గిరిజన బాలిక పైన జరిగిన అత్యాచారం, హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదివారం నాడు నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఘటన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
మెగావత్ కమల్ కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశాడని చెప్పారు. కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. పది నిమిషాల్లోనే కమల్ భిన్న కథనాలు వినిపించాడన్నారు. అతని కాల్డేటాను పరిశీలించామని చెప్పారు.
కమల్ అబద్ధాలు చెప్పినట్లు ధ్రువీకరించుకున్నామన్నారు. కమల్ కదలికలను గమనించామని, అతను తెలిపిన వివరాల్లో తేడాలు కనిపించాయన్నారు. అబద్దాలు చెప్పాడన్నారు. తనకు ఏ పాపం తెలియదని మొదట బుకాయించే ప్రయత్నం చేశాడన్నారు.
కమల్ పైన అనుమానంతో కొందరితో కలిసి భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ తర్వాత కమల్ కూడా వారితో వచ్చి ఫిర్యాదు చేశాడన్నారు.
అతని పైన అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించామని, ఆయన చెప్పిన వివరాలు ఎక్కడా పొంతన లేవన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు చెప్పారు.