దారుణం: 19 ఏళ్ల యువతిపై తండ్రీ కొడుకుల అత్యాచారం
హైదరాబాద్: తండ్రీ కొడుకులు ఒకరికి తెలియకుండా మరొకరు ఓ యవతిపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
బషీరాబాద్ టాకీతండాకు చెందిన 19 ఏళ్ల యువతి స్ధానికంగా ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. బషీరాబాద్కు చెందిన కాశప్ప గౌడ్ కుమారుడు అశోక్కు టాకీతండాలో కల్లు దుకాణం ఉంది. ఈ క్రమంలో అశోక్కు యవతితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయంతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అశోక్ తండ్రి కాశప్ప గౌడ్ కూడా యువతిని లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది.
నాలుగు రోజుల క్రితం స్ధానిక అంగన్ వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చి తాండూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆ యువతి ఏడు నెలలు గర్భవతి అని తేలింది. దీంతో వారు తాండూరులోని నిర్భయ కేంద్రం కౌన్సిలర్ సుభాషిణిని ఆశ్రయించారు.
మంగళవారం రాత్రి బాధితురాలు అధికారులతో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తండ్రీ కొడుకులపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తండ్రీ కొడుకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు.