బీజేపీలో ఆధిపత్యపోరు.. బండి సంజయ్ తో విభేదాలపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికరవ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందని తాజాగా బండి సంజయ్ కేంద్ర పెద్దల వద్ద అసహనం వ్యక్తం చేయడంతో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే బిజెపిలో బండి సంజయ్ కు సహకరించని వారెవరు? బండి సంజయ్ ఎందుకు ఇంతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు? బండి సంజయ్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అన్నది ప్రధానంగా చర్చగా మారింది. ఇక ఇదే సమయంలో బండి సంజయ్ కు రఘునందన్ రావు కు అసలే పొసగడం లేదని, త్వరలో రఘునందన్ రావు పార్టీ మారుతారంటూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తనకు బండి సంజయ్ కు గొడవలు లేవన్న రఘునందన్ రావు
ఇక దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. బీజేపీలో ఆధిపత్యపోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బండి సంజయ్ కు ఎటువంటి గొడవలు లేవని, బండి సంజయ్ నాయకత్వంలో తాము పని చేస్తున్నామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బిజెపిలో టాలెంట్ ఉండి పని చేసే వాళ్లకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని రఘునందన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో కంఫర్ట్ గానే ఉన్నానని చెప్పిన రఘునందన్ రావు ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తాను టిఆర్ఎస్ పార్టీలో కి వెళుతున్నాను అని జరుగుతున్న ప్రచారం బోగస్ అని పేర్కొన్న రఘునందన్ రావు మునిగిపోయే పడవను ఎక్కాలి అని ఎవరైనా అనుకుంటారా అంటూ ప్రశ్నించారు.
ఈ రోజే పార్టీలోకి వచ్చి రేపే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఏ పార్టీలోనూ నెరవేరదు
తాను తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ లో పని చేశానని, ఇప్పుడు దేశం కోసం పని చేయడానికి తనకు బీజేపీ అవకాశం ఇచ్చిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. బిజెపిలో మొదట్నుంచీ పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం తప్పని పేర్కొన్న రఘునందన్ రావు మారుతున్న కాలానికి అనుగుణంగా పొలిటికల్ డైనమిక్స్ మారుతుంటాయి అని, పార్టీ నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ రోజే పార్టీలోకి వచ్చి రేపే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఏ పార్టీలోనూ నెరవేరదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఓపికుంటే పదవులు వాటంతట అవే వస్తాయని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి పదవి తన టార్గెట్ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
మీటింగ్ ల విషయంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ నిజమే .. కానీ అసంతృప్తి కాదు
ఇక బండి సంజయ్ తో తనకు గొడవలు ఉన్నాయని మీడియా దుష్ప్రచారం చేస్తోంది అంటూ రఘునందన్ రావు తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో తాను ఎక్కడ బహిరంగంగా మాట్లాడింది లేదని స్పష్టం చేశారు. ఇక మీటింగ్ ల విషయంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని పేర్కొన్న రఘునందన్ రావు అది అసంతృప్తి కాదంటూ పేర్కొన్నారు. లక్ష్మణ్ తర్వాత తాను బీజేపీ అధ్యక్ష పదవి అడిగిన మాట వాస్తవమే అయినా ప్రస్తుతం బండి సంజయ్ నేతృత్వంలో పని చేస్తున్నాం అంటూ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలం బండి సంజయ్ నేతృత్వంలో కలిసి పనిచేస్తున్నామని అందరం సమిష్టిగా కలిసి నిర్ణయం తీసుకుంటున్నామని రఘునందన్ రావు పేర్కొన్నారు.