పాతబస్తీలో కలకలం: బరాత్లో పెళ్లి కొడుకు కాల్పులు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఆగస్టు 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాతబస్తీలో ఓ వివాహ వేడుక సందర్భంగా గుర్రంపై ఊరేగుతున్న వరుడు అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
పెళ్లి బరాత్లో ఓకే సారి రెండు రివాల్వర్లతో పది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అతడ్ని ఉత్సాహ పరుస్తూ అక్కడి వారు కేరింతలు కొట్టడం గమనార్హం. కాగా, కాల్పులు జరిపిన వరుడు ఓ పోలీసు అధికారి సమీప బంధువని తెలుస్తోంది.
ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు. కాల్పుల ఘటన జరగలేదని, వదంతులు నమ్మ వద్దని తొలుత దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

కాల్పుల వీడియో మీడియాలో రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ.. ఫలక్నుమా ఏసీపీని దర్యాప్తు అధికారికి నియమించి విచారణకు ఆదేశించారు.
కాగా, ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సులు పొందుతున్న వారు ఇలా వేడుకల్లో తమ అత్యుత్సాహంతో కాల్పులు జరుపుతూ.. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఆదివారం సాయంత్రం కాల్పులు జరిపిన పెళ్లి కొడుకు మోసిన్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications