కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. టెన్షన్ టెన్షన్.. తొలి జాబితా మార్చే ఛాన్స్..!
Recommended Video
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా కూడా హైకమాండ్ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థులను తేల్చలేక సతమతమవుతోంది. ఈ క్రమంలో ప్రకటించిన తొలిజాబితా కూడా వివాదాస్పదంగా మారింది. పార్టీ టికెట్లు దక్కనివారు బహిరంగంగానే ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు టికెట్ల ఖరారులో వారసత్వ రాజకీయాలకు, కొన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. బీసీలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించలేదని వాపోతున్నారు.
అదలావుంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే... ఒకే కుటుంబం నుంచి ఇద్దరి చొప్పున టికెట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు . మరోవైపు ఎన్నికలు సమీపిస్తుంటే అభ్యర్థుల ఎంపికలో నిదానంగా వ్యవహరించడమేంటని ఫైరవుతున్నారు. తొలిజాబితా అస్తవ్యస్తంగా ఉందని నిరసనలు వెల్లువెత్తడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈనేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ మార్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అయితే తొలిజాబితాను మార్చుకుంటూ ఉంటే మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇంకా ఎప్పుడు..! కార్యకర్తలో ఆందోళన
అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసిన టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు గురవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం.. అభ్యర్థుల విషయంలో హైకమాండ్ తర్జనభర్జన పడుతుండటం వారిని కలవరపెడుతోంది. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా తెగ హడావిడి చేసిన కాంగ్రెస్ పెద్దలు టికెట్ల ఖరారు విషయంలో ఎందుకు వెనుకబడుతున్నారనేది కార్యకర్తల ఆందోళన. అదలావుంటే సిట్టింగుల మీద సిట్టింగులు పెట్టి రిలీజ్ చేసిన తొలిజాబితా కూడా ఆశాజనకంగా లేదని మండిపడుతున్నారు.
ఫస్ట్ లిస్ట్ టెన్షన్.. ఆందోళనల వెల్లువ
ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు ప్రకటించిన తొలి జాబితాపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ లిస్ట్ లో జనగామ సీటు తనకు కేటాయించకపోవడంతో సీనియర్ నేతల పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ వెళ్లారు. తాండూర్ లో నారాయణరావు పార్టీకి రాజీనామా చేశారు. సోయం బాపూరావుకు టికెటిచ్చే విషయంలో పార్టీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు.
మిత్రపక్షమైన టీడీపీకి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కేటాయించడంతో ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మరోవైపు భిక్షపతియాదవ్, విజయరామారావు ఇండిపెండెంట్ గా పోటీచేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులకు అండగా ఉంటామంటూ హామీలు ఇవ్వడంతో పాటు, బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది హైకమాండ్. మరోవైపు ఢిల్లీ పెద్దల జోక్యంతో తొలిజాబితాలో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
హైకమాండ్ గుండెల్లో గుబులు.. రె'బెల్స్'
కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాపై అసంతృప్తులు ఎక్కడికక్కడ తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తే.. మరికొందరు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. అలయెన్స్ లో భాగంగా భాగస్వామ పక్షాలకు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ టికెట్ దక్కని పక్షంలో చాలాచోట్ల రెబెల్స్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో బుజ్జగింపుల పర్వం జోరందుకుంది. అయితే హైకమాండ్ హామీలతో కొందరు వేచిచూసే ధోరణిలో ఉంటే మరికొందరు రెబెల్స్ గా పోటీలో నిలబడేందుకే సై అంటున్నారు.
టీఆర్ఎస్ ఫైనల్ లిస్ట్.. కాంగ్రెస్ పరిస్థితేంటి
తొలిజాబితాలో 105మందిని తర్వాత మరో ఇద్దరిని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మిగిలిన 12 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయనున్నారు. దాదాపు 12 మంది పేర్లు ఖరారయినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా వీరి పేర్లు కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అలా టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా దూసుకెళుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా వ్యవహరిస్తుండటం కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది.