మిర్చి రైతులకు కాసుల వర్షం.. క్వింటాల్కు 32 వేలు.! చరిత్రలో ఫస్ట్ టైం !!
ఎర్రబంగారం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రోజు రోజుకు మిర్చి ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి పంట దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధరల ఊహించని విధంగా లభించండంతో రైతన్నలు ఉత్సాహంగా ఉన్నారు. దేశీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్ కు 32 వేల రూపాయాలు ధర పలికింది.
దేశి రకం క్వింటాల్కు రూ. 32వేలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ఎర్రబంగారంతో కళకళలాడింది. గత రెండు రోజులుగా మార్కెట్ యార్డుకు ఎండు మిర్చి తక్కువగానే వచ్చింది. అయితే గురువారం ఒక్కసారిగా సుమారు 60వేల బస్తాలు వచ్చాయి. దీంతో మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది . క్వింటాల్కు రూ. 32 వేలు ధర పలికింది. మార్కెట్ చరిత్రలో దేశి రకం మిర్చికి ఇంత రేటు పలకండం ఇదే ఫస్ట్ టైం అని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
రైతుకు సన్మానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు భిక్షపతి పండించిన దేశీ రకం మిర్చికి రూ 32 వేలు లభించింది. ఆ రైతును ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ సన్మానించారు. ఊహించని విధంగా తాను పంచించిన మిర్చికి ధర లభించడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా మార్కెట్లో మేలైన మిరప క్వింటాలు ఒక్కంటికి 29 వేల వరకు పెరగడం రైతుకు కలిసొచ్చిన అదృష్టంగా భావిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా వస్తున్న ధరలతో అన్నదాతలు ఉత్సాహంగా ఉన్నారు.
తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలు
ఈ ఏడాది అధిక వర్షాలకు తోడు వైరస్ కారణంగా మిర్చితోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత సంవత్సరం ఎకరాకు 20 నుంచి 30 క్వింటాలు వరకు దిగుబడి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావడమే గగనమైంది. దిగుబడి తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులకు ఊరట లభిస్తోంది. ఇతర దేశాలకు మిర్చి ఎక్స్ పోర్టు ఉన్నందువలన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.