చేపల లారీ బోల్తా.. చేపలకోసం ఎగబడిన జనం వీడియో చూస్తే షాకవ్వటం ఖాయం!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న ఒక లారీ బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్డు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. లారీ బోల్తా పడిన ఘటనతో అక్కడకు వెళ్లిన స్థానికులు, ప్రమాదంలో ఎవరికైనా గాయాలు తగిలాయా? లారీ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి ఎలా ఉంది? అన్న అంశాలను పక్కన పెట్టి చేపల వేట మొదలుపెట్టారు.
చేపల కోసం ఎగబడ్డ జనాలు... లారీ లోడు మాయం
చేపల లారీ బోల్తా పడింది అని తెలుసుకున్న స్థానికులు సమీప ప్రాంతాల నుండి పరుగుపరుగున వచ్చి చేపలు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. చేపల లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఇంకేంటి గుంపులుగుంపులుగా జమ కూడిన జనాలు చేపల కోసం ఎగబడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే చేపల కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు. ఒక్క అరగంటలోనే లారీలో ఉన్న లోడు చేపలు అన్నింటిని మాయం చేశారు.
చేపల కోసం జనాల వేట ... వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇక చేపల కోసం ఎగబడుతున్న జనాలను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు. సంచులు తెచ్చుకొని మరీ ఒక్కొక్కరు కిలోల కొద్దీ చేపలను ఎత్తుకెళ్లారు. ఇక బాగా చేపలు దొరికిన వారి ముఖాలు కళకళలాడాయి. ఇక టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా వాహనాలను ఆపి మరీ చేపలను ఎత్తుకెళ్ళారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చెట్ల పొదలలోనూ చేపల కోసం కొట్లాట
టన్నుల కొద్ది చేపలు రోడ్డు మీద పడడంతో రోడ్ మీద వాహనాల రాకపోకలను సైతం లెక్కచేయకుండా వాటికి అడ్డుపడుతూ మరీ చేపల కోసం పోరాటం సాగించారు జనాలు. ఇక చెట్ల పొదల్లోనూ సంచులు, షాపింగ్ బ్యాగ్స్ ఇలా ఏది దొరికితే అది తీసుకుని చేపలు పోగేసుకునే పనిలో పడ్డారు. కొంత మంది సుష్టుగా నాలుగు రోజుల పాటు చేపల కూరే తినేలా ప్లాన్ చేసుకుని మరీ చేపల సేకరణ చేశారు. ఇక దీనిపై జనాల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీన్ని ఫన్నీ గా తీసుకుంటే, మరికొందరు చేపల కోసం ఎగబడిన జనాల తీరు చూసి అవాక్కయ్యారు.
చేపల లారీ బోల్తా ఘటనతో పండుగ చేసుకున్న జనాలు
ఇదిలా ఉంటే పోలీసులు లారీ బోల్తా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ బోల్తా ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగి, సహాయక చర్యల్లో పోలీసులు బిజీగా ఉంటే చేపల కోసం ఎగబడిన ప్రజల తీరు పోలీసులకు విస్మయం కలిగించింది. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే చేపల లారీ బోల్తా ఘటనతో జనాలు పండుగ చేసుకున్నారు.
గతంలోనూ అనేక ఘటనలు.. ఫ్రీగా దొరికే వాటిపై మనవాళ్ళకు ఆసక్తి
గతంలో ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడితే బీర్ బాటిల్స్ ఎత్తుకు వెళ్లడం, ఆయిల్ లారీ బోల్తా పడితే బకెట్ల కొద్దీ ఆయిల్ తీసుకెళ్లడం వంటి అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా చేపల లారీ బోల్తా పడితే ఒక అరగంటలో లారీ లోడును మాయం చేశారు అంటే కొనుక్కున్న దాని కంటే ఫ్రీగా వచ్చే వాటిపై మనవాళ్లకు ఉండే ఆసక్తి ఇట్టే అర్థమవుతుంది.
చేపల లారీ బోల్తా.. చేపలకోసం ఎగబడిన జనం వీడియో చూస్తే షాకవ్వటం ఖాయం!!#fishlorry #fish #lorry pic.twitter.com/k9OuF6vRPm
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2022