ఎందుకిలా?: కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, ఆ ఐదు గ్రామాలు వేడుకలకు దూరం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంతో మంది ప్రముఖులు అవార్డులతో పాటు రివార్డులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా అందుకున్నారు.
అంతేకాదు హైదరాబాద్ నగరం మొత్తం ఈ వేడుకలకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని వేడుకలను దూంధాంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్మాయి. యావత్ రాష్ట్రం మొత్తం అవతరణ వేడుకలను జరుపుకుంటే ఆ ఐదు గ్రామాలు మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నాయి.
అవను... మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు దూరంగా ఉన్నారు. మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అవతరణ వేడుకలను బహిష్కరించారు.
అంతేకాదు గ్రామాల్లో పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వేములగట్ గ్రామంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మేల్యే రామలింగారెడ్డిల దిష్టిబొమ్మలను ఊరేగించి పంచాయతీ కార్యాలయం వద్ద దహనం చేశారు. 11 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నారు.
పల్లెపహాడ్ గ్రామంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొగుట మండలంలోని నాలుగు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలు ఎగురవేయగా, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామంలో జెండా ఎగరవేయకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఉపాధి కూలీలకు పంపిణీ చేసిన స్వీట్లను తిరిగి పంపించారు.
తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్లో జరుగుతున్న దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరసన దినంగా పాటిస్తున్నామంటూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్రజలు నిరసన ర్యాలీ తీశారు. దున్నపోతుపై ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేరు రాసి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం, నాయకులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని డిమాండ్చేస్తూ ప్రజాప్రతినిధులు దీక్ష చేపట్టారు.