మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక
హైదరాబాద్/ న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం నాడు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నాగం జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నాగం జనార్ధన్ రెడ్డితో పాటు ప్రజా యుద్ద నౌక గద్దర్ తనయుడు సూర్య కిరణ్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ కూడ బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని రాహుల్ గాంధీ నాగం జనార్ధన్ రెడ్డి సహా ఇతర నేతలకు సూచించారు. తనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా సూర్యకిరణ్ వెల్లడించారు. ప్రస్తుతం సూర్యకిరణ్ నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో రీసెర్చ్ అసోసియేట్ గా పని చేస్తున్నారు. . తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి సూర్యకిరణ్ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
బిజెపి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్దన్ రెడ్డి చేరికను స్థానికంగా ఉన్న దామోదర్ రెడ్డి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాగం జనార్ధన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమకు నష్టం లేదని బిజెపి నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాగాంధీదేనని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ విస్మరించిందని ఆయన పేర్కొన్నారు.