మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య; భద్రాద్రి జిల్లాలో ఘటన
సమాజంలో ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్ద కారణాలు కూడా కనిపించలేదు. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు, మనుషులలో పెరుగుతున్న మానసిక దౌర్బల్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఆత్మహత్యలు చేసుకునే వారిలో చదువు లేని వారి కంటే చదువుకున్న వారు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె, ఎంబిబిఎస్ చదివిన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామమైన బూర్గంపాడు మండలం లోని సారపాక లోని స్వగృహంలో మహాలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె అయిన మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా ఏమి తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కుటుంబ సభ్యులను, ఆమె స్నేహితులను విచారిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన కుమార్తె అకారణంగా ఆత్మహత్యకు పాల్పడడంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్నారు . ఇక ఈ విషయం తెలిసిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు పలువురు ఆయనను పరామర్శించడం కోసం తాటి వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకుంటున్నారు. మృతురాలు మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కి ప్రిపేర్ అవుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.