తాగిన అమ్మాయిలు! అర్ధరాత్రి కారు బీభత్సం, ఒకరి మృతి: ఆమె మద్యం తాగలేదని పోలీసులు
హైదరాబాద్: కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువతులు కలిసి వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కారు బీభత్సం సృష్టించింది.
ఏఎస్ రావు నగర్ నుంచి తార్నాక వైపు వస్తున్న స్కోడా కారు డీఏఈ కాలనీ వద్ద రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో అదుపు తప్పి ఎక్కి గోడను ఢీకొట్టింది. ఈ కారు బీభత్సం కారణంగా ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న అశోక్ అనే వ్యక్తి మృతి చెందాడు. కారు అతని మీద నుంచి దూసుకెళ్లింది.
తీవ్రంగా గాయపడిన అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. కారులో ఉన్న నలుగురు బీటెక్ అమ్మాయిలుగా గుర్తించారు. వారు ఓ పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా, యువతులు మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం మత్తులో కారును ఇష్టారీతిన నడిపి ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారంటున్నారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
యువత ఈశాన్య అజాగ్రత్తగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని కుషాయిగూడ సీఐ తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న యువతి మద్యం సేవించి లేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువతులు ఉన్నారని తెలిపారు. కారులో మలక్పేట సీఐ గంగారెడ్డి కూతురు హారికా రెడ్డి ఉన్నారని తెలిపారు. మిగిలిన ముగ్గురిలో ఓ యువతి మద్యం సేవించి ఉందన్నారు. ఏఎస్ రావు నగర్లో ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కారు ఈశాన్య రెడ్డి వాళ్లదే అని చెప్పారు. వీరంతా సెకండియర్ విద్యార్థినులు అని, కేసును పరిశీలిస్తున్నామని చెప్పారు.