సిగరేట్ కాల్చొద్దన్నందుకు రెస్టారెంటులో రెచ్చిపోయిన పోకిరీలు
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంటులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. రెస్టారెంటులో సిగరేట్ తాగవద్దని యజమాని చెప్పినందుకు అతని పైన దాడి చేశారు. అడ్డుకున్న సిబ్బంది పైన కూడా దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటన ఉప్పల్ పరిధిలో జరిగింది. ఈ ఘటన పైన మేడిపల్లి పోలీసు స్టేషన్లో రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు చేశారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. సిగరేట్ కాల్చవద్దన్నందుకు తమను చావబాదారని బాధితులు చెప్పారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
చైతన్యపురిలో యువతి అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. చందన అనే ఇంటర్ విద్యార్థిని వారి ఇంటిముందు శవమై పడి ఉండగా మంగళవారం ఉదయం రోడ్లు ఊడ్చేందుకు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది గమనించారు.
తుకారంగేట్ పోలీస్ సీఐ అర్జనయ్య చైతన్యపురిలోని కమలానగర్ కాలనీలోని భవనంలో రెండో అంతస్తులో కుటుంబంతో ఉంటున్నారు. ఆయన కుమార్తె చందన నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. చందన భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న సరూర్నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్య, పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న భర్త
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. భార్యా పిల్లలకు విషమిచ్చిన భర్త తనూ ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన సోమవారం సీతారాంబాగ్లో జరిగింది. అఫ్జల్సాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతని స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా, నర్వ గ్రామం.
దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఇతని తండ్రి నగరానికి వచ్చి సీతారాంబాగ్లో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం వరకు అత్తాపూర్లో స్క్రాప్ వ్యాపారం చేసిన బాలరాజు, ఏడాది క్రితం తన వ్యాపారాన్ని ఎల్బీనగర్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ప్లాస్టిక్ గోదాం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో నష్టాలు రావడంతో వ్యాపారాన్ని తన బాబాయికి అప్పగించాడు.య ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసికి ఒత్తిడికి గురయ్యాడు. సీతారాంబాగ్ అఫ్జల్సాగర్లో భార్య సురేఖ, కవలలైన మేథ, మేఘన(15 నెలలు) తల్లి మణెమ్మ, తమ్ముడు ప్రేమ్తో కలిసి రాజు అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర అయినా బాలరాజు గది తలుపులు తెరవక పోవడంతో తల్లి మణెమ్మ, తమ్ముడు ప్రేమ్ తలుపులు కొట్టారు. ఎంతకీ లేవకపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
అఫ్జల్సాగర్ చేరుకున్న హబీబ్నగర్ పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా బాలరాజు ఫ్యానుకు ఉరేసుకని కనిపించాడు. సురేఖ, మేథ, మేఘన పరుపుపై విగత జీవులై పడి ఉన్నారు. బాలరాజు, సురేఖ మృత దేహాలను ఉస్మానియా మార్చురికీ, చిన్నారులు మేథ, మేఘన మృతదేహాలను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
భార్యా, పిల్లలకు బాలరాజు విషమిచ్చి, బాలరాజు ఉరేసుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.












Click it and Unblock the Notifications