మహిళల ఉచిత బస్సు ప్రయాణం..టీజీఎస్ఆర్టీసీకి డబుల్ బెనిఫిట్!
తెలంగాణ ఆర్టీసీ ఆదాయపరంగా పురోగతిని సాధిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని తెలంగాణా ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతీరోజూ పదివేల బస్సులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు పదివేల బస్సులు నడుస్తున్నాయని, సుమారు 60లక్షల మంది ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నామని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తెలిపారు. వీరిలో దాదాపు 45 లక్షల మంది మహిళలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న నాటి నుంచి 250 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసినట్టు నాగిరెడ్డి వెల్లడించారు.

ఉచిత బస్సు ప్రయాణంతో 8,500 కోట్ల రూపాయల ప్రయాణ ఖర్చు ఆదా
ఈ పథకం అమలుతో మహిళలు మొత్తం 8,500కోట్ల రూపాయల వరకు ప్రయాణ ఖర్చును ఆదా చేసుకున్నారని ఆయన తెలిపారు. నేడు భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టిసి ఎండి నాగిరెడ్డి అక్కడ మొక్కలు, నాటి పర్యావరణ పరిరక్షణకు ఆర్టీసీ చేస్తున్న కృషిని తెలిపారు. అనంతరం బస్సుల పరిస్థితిని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులు
గత రెండు సంవత్సరాలలో రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్న ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ఎనిమిది వందలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో హైదరాబాద్ నగరం అంతా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడతామన్నారు. ఆపై గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు.
ఆర్టీసీని బలోపేతం చేస్తున్న ఉచిత బస్సు పథకం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. tsrtc ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం నుండి ఇప్పటివరకు ఆర్టీసీ లాభాల బాటలో ఉందన్నారు.












Click it and Unblock the Notifications