ఎమ్మెల్యే ఎలా ఉంటాడో చూపిస్తా! : టోల్ ప్లాజా నిర్వాహకులపై ఊగిపోయిన గంప
నిజామాబాద్:ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు టోల్ ప్లాజా నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎమ్మెల్యే అంటే తెలియని వాడివి.. ఎందుకు పెట్టుకున్నావు వాడిని .. నా ముందుకు పిలిపించు. వాడు ఎంతటివాడు. తక్షణమే వాడిని పనిలో నుండి తొలగించు' అంటూ గోవర్ధన్ నిర్వాహకులపై మండిపడ్డారు.
టోల్ప్లాజా ఇంఛార్జ్ అయిన మురళితో మాట్లాడుతూ.. 'ఏ మురళి నీ టోల్ప్లాజ్లో లోకల్ సిబ్బంది తప్ప నాన్లోకల్ సిబ్బంది పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందినవారే టోల్ప్లాజాలో పనిచేయాలి' అని తేల్చి చెప్పారు. ఈ ఘటన శనివారం భిక్కనూరు సమీపంలో గల టోల్ప్లాజా వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని బాగిర్తిపల్లి ఎంపిటిసి సభ్యుడు తొగరి సుదర్శన్ తాను ఎంపిటిసి సభ్యుడినని కావాలంటే ఎమ్మెల్యేకు చెబుతానని టోల్ప్లాజా వద్ద చెప్పగా.. ఎమ్మెల్యే ఎవరో తెలియదంటూ సిబ్బంది చెప్పడంతో ఆ ఎమ్మెల్యేకు ఆగ్రహం వచ్చింది. తక్షణమే ప్లాజా ఉద్యోగి నర్సింహారెడ్డిని తన ముందుకు పిలిపించాలని, ఎమ్మెల్యే అంటే ఏమిటో, ఎమ్మెల్యే పవర్ ఏమిటో చూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టోల్ప్లాజా ఇన్చార్జి మురళీధర్రెడ్డి తప్పు జరిగింది క్షమించాలని కోరారు.
రోజు క్రితమే నర్సింహారెడ్డికి వార్నింగ్ ఇచ్చామని, ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని వేడుకున్నాడు. కాగా, మండల నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు వచ్చి టోల్ప్లాజా పనితీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు. ఇటీవలే ఆర్డీఓ నగేశ్రెడ్డిని టోల్ప్లాజా వద్ద ఆపితే స్థానిక తహశీల్దార్ అంజయ్య వెళ్లి టోల్ప్లాజా నుండి పంపించారని, అంతకు ముందు జిల్లా కలెక్టర్ యోగితారాణాకు అదే పరిస్థితి తలెత్తిందని పలువురు నాయకులు ఆరోపించారు.
టోల్ప్లాజా నిర్వాహకులు తీరు మార్చుకోకపోతే తట్టబుట్ట పట్టుకుని ఇక్కడి నుండి వెళ్ల్లిపోవాల్సి వస్తుందని, ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద లేని ఆరోపణలు భిక్కనూరు టోల్ప్లాజాపై ఎందుకు వస్తున్నాయని గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాకుండా లోకల్ చెప్తే ఇందల్వాయి వద్ద పంపిస్తున్నారని, కానీ ఇక్కడ లోకల్ అని చెప్పినా కూడా పంపించకపోవడం ఎంత దారుణమన్నారు. ఎమ్మెల్యే స్టిక్కరు ఉన్న కార్లను కూడా పంపించడం లేదని ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యే అంటే అంత అలుసా అంటూ మండిపడ్డారు. వెంటనే టోల్ప్లాజాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రికార్డుల్లో పరిశీలించారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సిబ్బంది మాత్రమే టోల్ప్లాజా వద్ద పనిచేయాలని ఆదేశించారు.