ఏకంగా గంజాయి చాక్లెట్లు.. గంజాయి దందాలో ఎంతగా ముదిరిపోయారబ్బా!!
మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి. గంజాయి తెలుగురాష్ట్రాల్లో చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించడంతో పాటు, గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా గంజాయి దందా సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటుంది. ఇక ఏకంగా పోలీసులకు చిక్కకుండా చాక్లెట్ రేపర్ లలో గంజాయి చాక్లెట్లను పెట్టి విక్రయిస్తున్నారు అంటే ఎంతగా గంజాయి దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా పటాన్చెరులో గంజాయి దందా చేస్తున్న కేటుగాళ్లు, గంజాయి కి అలవాటు పడిన వారికి గంజాయి చేర్చడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. చాక్లెట్ రేపర్లలో చాక్లెట్ల రూపంలో గంజాయి నింపి, చార్మినార్ గోల్డ్ మునఖ్చా పేరుతో విక్రయిస్తున్నారు. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో గంజాయి ని చొప్పించి చాక్లెట్లు విక్రయాలు జరుపుతూ, చిన్నారులను కూడా గంజాయికి బానిసలుగా తయారు చేస్తున్నారు.
ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పటాన్చెరు పరిసర ప్రాంతాల్లోని పాన్ షాప్ లు, ఇతర షాపులలో ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులు గురువారం నాడు వారిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు పటాన్చెరు మండలం పాశమైలారం, ఇన్స్నాపూర్ పరిధిలోని మూడు పాన్ షాపుల్లో ఇన్స్పెక్టర్ సీతారాంరెడ్డి నేతృత్వంలోని ఎక్సైజ్ అధికారులు 271 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పాన్ షాప్ యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఒడిశాకు చెందిన ముగ్గురు గంజాయి దందా చేసే వారు అనిమేష్ దాస్, రంజిత్ భద్ర, బ్రిజు మోహన్ పాత్రలను పట్టుకున్నారు. ఇక ఈ గంజాయి దందా వ్యవహారంలో వెనుక ఎవరెవరు ఉన్నారు? ఈ చాక్లెట్లను ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు? ఈ చాక్లెట్లలో ఎంతమేరకు గంజాయిని పెడుతున్నారు? ఎలా సరఫరా చేస్తున్నారు? వంటి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసీఆర్ కు ఈసీ షాక్.. బీఆర్ఎస్.. ఆంధ్రప్రదేశ్ అంటూ; తెలంగాణాకు గుర్తింపేది?