గ్రేటర్ పోల్స్: ఓటేసిన 80 ఏళ్ల వృద్ధురాలు, వారందరికి స్ఫూర్తి అంటూ కేటీఆర్ ప్రశంస
హైదరాబాద్: నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. యువత, విద్యావంతులు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు కూడా అంతే. గ్రేటర్ ఎన్నికలు ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యాయి. కానీ, ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు మాత్రం ఉత్సాహం చూపడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా.. పోలింగ్ శాతం 20 శాతం కూడా దాటకపోవడం గమనార్హం.

ఇంటికే పరిమితమైన నగర ఓటర్లు..
జీహెచ్ఎంసీ ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఓటర్లు ఇళ్ల నుంచి ఓటు వేసేందుకు బయటకు రాకపోవడం హర్షించదగని విషయం. పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిగా కనిపిస్తున్నాయి. అయితే, పలువురు వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు రావడం గమనార్హం.
ఓటేసిన 80ఏళ్ల మహిళకు కేటీఆర్ ధన్యవాదాలు
ఓ 80ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. కరోనా లాక్డౌన్ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలు మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసింది. ఈ విషయాన్ని ఆమె మనవరాలు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది. ఈ పోస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓటు వేసిన ఆ వృద్ధురాలికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఓటేయకుండా కేవలం ఫిర్యాదులకే పరిమితం అయ్యే వారికి ఆమె ఓ స్ఫూర్తి అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
Recommended Video

గ్రేటర్ గత రికార్డునైనా బ్రేక్ చేస్తారా? లేక చతికిలపడతారా?
ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా పాలకులను నిలదీసే నగరవాసులు.. తమకు నచ్చిన నేతను ఎన్నుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. గత ఏడాది గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతానికిపైగా పోలింగ్ నమోదు కాగా, ఈసారి 50 శాతాన్ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ నగర ఓటర్లు మాత్రం కదలడం లేదు. మంగళవారం 1 గంట వరకు 18.2 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా నగర ఓటర్లు గత రికార్డును బ్రేక్ చేస్తారా? లేక అంతకు తక్కువగానే నమోదు చేస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా, పలు ప్రాంతాల్లో పార్టీల గుర్తులు మారడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications