గ్రేటర్ సర్వేలో 75 సీట్లు టిఆర్ఎస్, 20 సీట్లు బిజెపి-టిడిపికి: 'బినామీ సర్వే'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో తెరాస జెండా ఎగురుతుందని తాజా సర్వే ఒకటి తెలిపింది. ఎన్టీవీ, నీల్సన్, ఓఆర్జీ మార్గ్, మైండ్ఫ్రేమ్ సంస్థలు సంయుక్తంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించాయి. ఆ ఫలితాలు వెల్లడించాయి.
తెరాసకు 75 నుంచి 85 స్థానాలు, బిజెపి - టిడిపి కూటమికి 20 నుంచి 25 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 10-12 స్థానాలు, మజ్లిస్ పార్టీకి 40-45 స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.
కెసిఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని సర్వేలో తేలింది. దాదాపు అన్ని జోన్లలోనూ టిఆర్ఎస్కు సానుకూల స్పందన వచ్చిందని సర్వే తెలిపింది. గత ప్రభుత్వ పని తీరుతో, ప్రస్తుత ప్రభుత్వ పని తీరును పోల్చి సర్వే చేసింది.
గ్రేటర్లోని సౌత్ జోన్ మినహా ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లలో ఈ సర్వే నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటేస్తామని 63శాతం ప్రజలు పేర్కొన్నారని తెలిపింది. బీజేపీ-టీడీపీ కూటమికి ఓటేస్తామని 21శాతం మంది, కాంగ్రెస్కు ఓటేసేవారు తొమ్మిది శాతంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. పాతబస్తీలో పట్టున్న మజ్లిస్ మొత్తం నగరవ్యాప్తంగా ఆరు శాతం ఓటర్లు మద్దతుగా నిలిచారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు... చాలా బాగుందని 27 శాతం మంది, బాగుందని 46 శాతం, ఫర్వాలేదని 21 శాతం మంది, బాగోలేదని నాలుగు శాతం పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని 24 శాతం మంది, బాగుందని 46 శాతం, ఫర్వాలేదని 23 శాతం, బాగోలేదని ఐదు శాతం మంది తెలిపారు.
సీమాంధ్రులు అధికంగా నివసిస్తున్న వెస్ట్ జోన్లోనూ కేసీఆర్ పనితీరు పట్ల బాగా సంతృప్తి వ్యక్తమైందని, టీఆర్ఎస్ ప్రభుత్వమైతేనే నగర సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడినట్లు సర్వేలే తేలింది.
ప్రభుత్వ పనితీరుపై.. మొత్తంగా చాలా బాగుందని 24 శాతం మంది, బాగుందని 46 శాతం, ఫర్వాలేదని 23 శాతం, బాగోలేదని 5 శాతం మంది చెప్పారు. కెసిఆర్ పనితీరుపై చాలాబాగుందని 27 శాతం, బాగుందని 46 శాతం, పర్వాలేదని 21 శాతం, బాగాలేదని నాలుగు శాతం మంది చెప్పారు.
ఏ పార్టీ మీ సమస్యను పరిష్కరిస్తుందని అడగగా... టిఆర్ఎస్ పేరు 63 శాతం, బిజెపి పేరు 12 శాతం, టిడిపి పేరు 9 శాతం, కాంగ్రెస్ పేరు 9 శాతం, మజ్లిస్ పేరు 6 శాతం మంది చెప్పారు. గత ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వ తీరు బాగుందని 58 శాతం మంది, బాగుందని 37 శాతం, పర్వాలేదని 4 శాతం మంది చెప్పారు.
జిహెచ్ఎంసీలో అవినీతి తగ్గిందని 28 శాతం మంది, అలాగే ఉందని 45 శాతం, పెరిగిందని 27 శాతం మంది చెప్పారు. నగరంలో మంచి నీటి సరఫరా బాగుందని 44 శాతం మంది, పర్వాలేదని 37 శాతం మంది, బాగోలేదని 18 శాతం మంది చెప్పారు.
భూఆక్రమణలు తగ్గాయని 23 శాతం మంది, కొనసాగుతున్నాయని 59 శాతం, పెరిగాయని 17 శాతం మంది చెప్పారు. ఆరోగ్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు, రోడ్ల పరిస్థితి, డ్రెయినేజీ తదితరాల పరిస్థితుల పైన చాలామంది పర్వాలేదని చెప్పారు. కాగా ఈ సర్వే పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీ సర్వేలు చేయించుకుంటున్నారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.