చాక్లెట్లు ఆశపెట్టి బాలికపై అత్యాచారం: మూసీనదిలో శవం
హైదరాబాద్: పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరుగని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇందిరానగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని పొరుగునే ఉండే ఆచన్న (46) అనే వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రక్తం మరకలతో ఇంటికి వచ్చిన చిన్నారిని చూసిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో మూసీ నదిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం బయటపడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబ్ పేటలో గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
ముళ్లపొదల్లో పసిపాప
రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన సంఘటన గురువారంనాడు రంగారెడ్డి జిల్లా షాబాద్ పైల్వాన్ పాహి దర్గా వద్ద జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను దర్గా సమీపంలోని ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు.
గుక్క పట్టి ఏడుస్తున్న చిన్నారిని అటుగా వెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, ఐటిడిసి అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. పాప ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిచిన తర్వాత పాపను శిశు విహార్కు తరలిస్తారు.