రాములోరి భక్తులకు గుడ్న్యూస్.. భద్రాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం..
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన రామాలయం భద్రాచలం. ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని పిలుస్తారు. ఇక, ఈ రాములోరి ఆలయానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఓ శుభవార్తను అందించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. నిన్న (జులై 2) ఆలయ ఈవో రమాదేవి బ్రేక్ దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఆలయంలో బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి రోజూ రెండు సార్లు బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. బ్రేక్ దర్శన టికెట్ ధరను ఆలయ అధికారులు రూ.200గా నిర్ణయించారు. ఇక నుంచి భద్రాద్రి రామాలయంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ తిరిగి రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు.

ఈ బ్రేక్ దర్శనాల సమయంలో రాములోరి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తదితర పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.200గా నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనం టిక్కెట్లు భద్రాచలం ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో ప్రకటించారు. ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాత సేవతో పూజ కార్యక్రమాలు మొదలవుతాయి.
రాములోరి సన్నిధిలో ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన ఉంటుంది. ఆ తర్వాత 8.35 నుంచి 9 గంటల వరకు సహస్ర నామార్చన కార్యక్రమం ఉంటుంది. అనంతరం 8.30 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు రాములవారికి అర్చనలు జరిపిస్తారు.
వీటితోపాటు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు రామయ్య నిత్యకల్యాణం ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భద్రాద్రి రామయ్యకు రాజభోగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. తిరిగి రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు నివేదన సమర్పించిన అనంతరం పవళింపు సేవ కార్యక్రమం ఉంటుంది.












Click it and Unblock the Notifications