ఎగిరి గంతేసే వార్త.. 2050- విజన్ మాస్టర్ ప్లాన్, ఎయిర్ పోర్ట్ ఇంకా ఎన్నో..
ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న వరంగల్ పై తెలంగాణా సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఓరుగల్లు వాసులకు శుభవార్త చెప్పింది. వరంగల్ నగర అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్ను విడుదల చేస్తారని వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వరంగల్ అభివృద్ధికి సమీక్షా సమావేశం
నేడు హైదరాబాద్లోని ఎమ్ .సి.హెచ్ .ఆర్.డీ లో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన మాస్టర్ ప్లాన్ తో పాటు అనేక కీలక అంశాలను చర్చించారు.

మాస్టర్ ప్లాన్ తో పాటు ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవే
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ది పరచాలన్న కృతనిశ్చయంతో ఎన్నొ సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ను తమ ప్రభుత్వం కొలిక్కి తీసుకువచ్చిందని అన్నారు.
మామునూరు ఎయిర్ పోర్ట్ పై శుభవార్త
ఇక వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగనున్నాయని కూడా చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్పోర్ట్ లేదని వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ రాబోతోందని, వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2050- విజన్తో వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిపారు.

ఇన్నర్ రింగ్ , ఔటర్ రింగ్ రోడ్డు పనులపై ఆదేశం
ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల వేగం పెంచాలన్నారు. 41 కిలోమీటర్ల పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని మొదటి దశలో 20 కిలో మీటర్లు, రెండవ దశలో 11 కిలోమీటర్లు, మూడవ దశలో 9 కిలోమీటర్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
భద్రకాళి చెరువులో పూడిక తీత పనులకు ఆదేశం
382 ఎకరాల పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువులో పేరుకుపోయిన పూడికను తీయాలని , ఇందుకు సంబంధించిన పనులను రేపటినుంచే మొదలు పెట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండ చెరువును ఖాళీ చేయాలని అధికారులకు సూచించారు . ఈ చెరువు 40 శాతం గుర్రపుడెక్కతో నిండిపోయిందన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులపై ఆదేశం
మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఏర్పాటు చేసిన కంపెనీలు తప్పనిసరిగా స్దానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా వరంగల్ అభివృద్దిపై నిర్వహించిన విస్తృత స్ధాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో ఓరుగల్లు వాసులలో హర్షం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications