లంచావతారాలు ...ఏసీబీ ట్రాప్ లో పడిన ఇద్దరు ప్రభుత్వాధికారులు
తెలంగాణా రాష్ట్రంలో ఇద్దరు ప్రభుత్వాధికారులు అవినీతి నిరోధకశాఖ అధికారుల ట్రాప్ లో పడ్డారు . నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ సబ్ఇన్స్పెక్టర్ను, హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లోని 14వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?
20 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ ఇన్స్పెక్టర్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఓ ట్రాక్టర్ యజమాని నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ఇన్స్పెక్టర్ ను పట్టుకున్న అవినీతి నిరోధక శాఖాధికారులు పథకం ప్రకారం వలపన్ని మరీ సబ్ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలానికి చెందిన రాజు, భాస్కర్ల ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ బల్మూర్ ఎస్ఐ వారి ట్రాక్టర్లను స్టేషన్కు తీసుకెళ్లారు. ట్రాక్టర్లు వదలాలంటే రూ. 30వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని సంప్రదించారు. దాంతో అధికారులు పథకం వేసి, బాధితుల నుంచి ఎస్సై రూ. 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
15వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను పట్టుకున్న ఏసీబీ
ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లోని 14వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్న ప్రసన్న లక్ష్మి కూడా ఓ కాంపౌండ్ వాల్ కేసుకు సంబంధించిన కేసులో బాధితుడిని రూ. 20వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వారు ప్రణాళిక వేసి బాధితుడి నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా ప్రసన్న లక్ష్మిని పట్టుకున్నారు.
అవినీతి అధికారులపై సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1064
ఇక ఇద్దరు అవినీతి అధికారులను పట్టుకున్న ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచం అడిగినా ఏసీబీ టోల్ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అవినీతి అంతమొందించటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చేపలు అవినీతికి పాల్పడుతూనే ఉన్నాయి. అలంటి వారి ఆట కట్టించాలంటే ఏసీబీకి సమాచారం ఇవ్వటం తప్పనిసరి.