గ్రూప్-2 అభ్యర్థులకు తీపి కబురు: సర్టిఫికేట్ల పరిశీలనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గత కొద్ది నెలలుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల నియామక ప్రక్రియకు హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది.
హైదరాబాద్: గత కొద్ది నెలలుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల నియామక ప్రక్రియకు హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగించేందుకు కోర్టు అనుమతిచ్చింది.
సుమారు 1000 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున దరఖాస్తుల పరిశీలనకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జవాబు పత్రాలు మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం నియామక ప్రక్రియపై స్టే విధించింది.

కాగా, స్టే గడువు ముగియడంతో గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. నియామక ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పీఎస్సీ కోరగా.. స్టే పొడిగించాలని పిటిషనర్లు కోరారు. అయితే, స్టే పొడిగించేందుకు నిరాకరించిన కోర్టు.. ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్ పీఎస్సీకి అనుమతిచ్చింది.
ఏవైనా అభ్యంతరాలుంటే తదుపరి విచారణలో చెప్పాలని పిటిషనర్లకు సూచించింది. అనంతరం ఈ విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ధ్రువ పత్రాల పరిశీలనకు హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైంది టీఎస్ పీఎస్సీ. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలకు ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications