చీకటి ఒప్పందం, పక్క రాష్ట్రం బాబు చెబితే: హరీష్
మెదక్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం ఆరోపించారు. ఆ రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మెదక్ లోకసభ ఎన్నికల్లో తెరాస ప్రభంజనాన్ని తట్టుకోలేక ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు తమదే అన్నారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపు పైన టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు సవాల్ విసిరితే తాను స్వీకరించానని చెప్పారు.
టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీకి మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, మాట మార్చటం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
బీజేపీ-టీడీపీ అభ్యర్థి జగ్గారెడ్డి సమైక్యవాది అన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ నిర్ణయించిందా లేక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారా ప్రజలకు చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలంగాణ ఉధ్యమం సమయంలో రాజీనామా చేయకుండా ఈ ప్రాంత ప్రజలను మోసగించారన్నారు. పేరుకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని, ఆన బీజేపీ కేంద్రమంత్రి వెంకయ్య, చంద్రబాబు కనుసన్నుల్లో పని చేస్తున్నారన్నారు.