హైదరాబాద్కు నీళ్లు రాకుండా కుట్ర: ఏపి మంత్రిపై హరీశ్, టిడిపికి బహిష్కరణే
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టును కట్టకుండా చేసి హైదరాబాద్కు వచ్చే నీటిని అడ్డుకోవాలని ఏపి ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డిండి, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు జారీ అయ్యాయని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదంటున్న మంత్రి ఉమ.. పట్టిసీమను అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభించారని హరీశ్ రావు ప్రశ్నించారు. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను ఎవరీ అనుమతితో కట్టరాని నిలదీశారు. మీరు కడితే తప్పు కాదు గానీ, మేం కడితే తప్పా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కృష్ణా నది మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువగా ప్రవహిస్తోందని, ఇక్కడ ప్రాజెక్టు కట్టితీరుతామని చెప్పారు. గోదావరి నది నీటిని కృష్ణా నదికి తరలిస్తే ఎగువ రాష్ట్రానికి నష్టమని కృష్ణా ట్రిబ్యూనల్ చెప్పినా.. 80టిఎంసిల నీటిని గోదావరికి తరలిస్తున్నారని ఆరోపించారు. ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ ప్రభుత్వాలు వ్యతిరేకించినా పోలవరంను ఏ అనుమతితో ప్రారంభించారని హరీశ్ రావు ప్రశ్నించారు.
మిగులు జలాలున్నాయి కాబట్టే తాము ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుని హైదరాబాద్కు నీళ్లు అందకుండా కుట్ర చేస్తున్నారని ఏపి మంత్రిపై మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి ఉమ కృష్ణా నీళ్లన్ని తమవే అన్నట్లుగా మాట్లాడుతున్నారని.. హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేయాలనే దేవినేని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, పాలమూరు ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించేందుకు కడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులను కట్టొద్దంటున్న ఏకైక పార్టీ టిడిపినేనని ఆరోపించారు. టిడిపి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో రైతులు లేరా? ప్రజలు లేరా? హైదరాబాద్ ప్రజలకు నీరు వద్దా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు వద్దంటారా? అని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రశ్నించారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలు టిడిపిని బహిష్కరిస్తారని చెప్పారు.
దేశంలో ఎక్కడ ప్రాజెక్టు కట్టినా పాలమూరు కార్మికులు ఉంటారనీ.. అలాంటి పాలమూరుకే ప్రాజెక్టు ఇప్పటివరకు లేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ప్రాజెక్టును కట్టితీరుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్లో లేని చెన్నైకి నీళ్లిస్తారు కానీ, బేసిన్లో ఉన్న హైదరాబాద్కు నీళ్లివ్వరా? అని నిలదీశారు.