కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేశారేమో..: కాంగ్రెస్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందిందని మండిపడ్డారు.
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే అహం అడ్డొస్తోందని కేటీఆర్ విమర్శించారు. 2022లో మేడిగడ్డ ఆనకట్టపై నుంచి నీరు వెళ్లినా తట్టుకున్న విషయాన్ని విస్మరిస్తోందన్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నేతలే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేశారేమో అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్వహణ లోపం ఉంటే అక్కడ ఒక్క చోటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఏదో కుట్ర జరిగిందన్నదే తన వ్యక్తిగత అనుమానమని చెప్పారు.

తమను ఓడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే, ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపైపైనా విమర్శలు గుప్పించారు కేటీఆర్. అన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఎన్డీఎస్ఏ విషయంలో ఎందుకు ఏకీభవిస్తోందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, అది బీజేపీ కార్యాలయంలో సిద్ధమైన నివేదికగా వ్యాఖ్యానించారు.
శ్రీపాద ఎల్లంపల్లిలో ఇప్పుడు నడిపిస్తున్న పంపులను కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎల్లంపల్లి నీరు సరిపోదని, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక పంటకు 36 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని, ఇప్పటికైనా నీటిని రైతుల పొలాలకు మళ్లించాలని సూచించారు.
రిజర్వాయర్లు నింపాక వర్షాలు వేస్తే కిందికి వదిలితే తప్పు ఏముందన్న కేటీఆర్.. కొంత కరెంట్ బిల్లు అవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కరవుకు ఇన్సూరెన్స్ లాంటిందిగా అభివర్ణించారు. 60 నుంచి 70 లక్షల ఎకరాలకు మేలు చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 94 వేలు కోట్లు ఖర్చు చేస్తే అవినీతి అంటున్నారని మండిపడ్డారు. 1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి చేస్తే ఎంత మంది రైతులకు లాభం కలుగుతుందని కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.
ఎవరు కమిషన్ల కోసం ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని కాంగ్రెస్ సర్కారునుద్దేశించి వ్యాఖ్యానించారు కేటీఆర్. ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు కట్టామని, వృథా చేస్తారా? అని ప్రశ్నించారు. కరెంట్ ధర గురించి చూస్తున్నారు. కానీ, రైతుల పంట గురించి ఆలోచించరా? అంటూ నిలదీశారు. బేషజాలకు పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి పంపులు నిలిపివేస్తే తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు కేటీఆర్.












Click it and Unblock the Notifications