అతను తెరాస లీడర్ కాదు, ఏఏపీ నేత: కర్నె, ఆ వీడియో ఎలా లీక్ అయిందంటే..!
సూర్యాపేటలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన సంతోష్ అనే వ్యక్తితో తెరాసకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. సంతోష్ తెరాస నేత కాదని, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అని చెప్పారు.
హైదరాబాద్: సూర్యాపేటలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన సంతోష్ అనే వ్యక్తితో తెరాసకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. సంతోష్ తెరాస నేత కాదని, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిన సంతోష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్వీ నాయకులే అని చెప్పారు.
అసత్య ప్రచారాలు చేసే వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే వారి పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తమ పార్టీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా సూర్యాపేట పట్టణంలో ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పేరిట ప్రయివేటు జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. సంతోష్ సెల్ఫోన్ పోవడంతో ఆ ఫోన్లోని వీడియోలు వాట్సాప్లో రావడంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
కాగా, సూర్యాపేట జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతగా చెప్పుకుంటున్న ఈదలూరి సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు యువకులను తీవ్రంగా కొట్టిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అతనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
యువకుడి కడుపులో తన్నిన టిఆర్ఎస్ లీడర్?: కేటీఆర్ వివరణ
కాగా, ఓ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్న సంతోష్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, తనకు మంత్రులతో సంబంధాలున్నాయంటూ నిరుద్యోగులను నమ్మించేవాడు. అతని మాటలు నమ్మి, చివరకు మోసపోయామని తెలుసుకుని సదరు నేతను నిలదీసిన బాధితులపై బెదిరింపులకు పాల్పడటంతోపాటు దాడులు కూడా చేస్తున్నట్లు సమాచారం.