కేసిఆర్ కు రైతు ఉసురు తగుల్తది.!రైతన్న గోస చూస్తుంటే గుండె ముక్కలవుతోందన్న ఈటల.!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, కల్లాల్లో రైతుల గోస వర్ణనాతీతంగా ఉందని, రైతన్న ఉసురు చంద్రశేఖర్ రావుకు ఖచ్చితంగా తగులుతుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. ఈ సీజన్ లో ధాన్యం ఎంత అయినా కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా చంద్రశేఖర్ రావు వచ్చే సీజన్ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు ముందుచూపు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకుంటున్నారని ఆవేదనవ వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు రాజకీయాలు చేసుకోవచ్చు గానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, రైతులతో పెట్టుకున్నవారు ఎవరు ముందుకు పోలేక పోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని స్పష్టం చేసారు ఈటల రాజేందర్.
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించిందని, చంద్రశేఖర్ రావు కూడా ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యం కొననందుకు రైతులకు క్షమాపణ చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయాలని ఈటల డిమాండ్ చేసారు. రైతు తెలివి లేని వారు, చదువు రాదు, సంఘటితంగా ఉండరు అని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారేమో అని, సందర్భం వచ్చినప్పుడు రైతులు కర్రు కాల్చి వాత పెడతారని చంద్రశేఖర్ రావును ఈటల రాజేందర్ హైచ్చరించారు. ఈ వర్షాకాలంలో పంట పండినా సరైన సమయంలో కొనకపోవడం వల్ల తడిచి మొలకలెత్తిందని అన్నారు. దీనికి పూర్తి బాద్యత చంద్రవేఖర్ రావుదే అన్నారు. నెల రోజులుగా రైతులు ఇబ్బంది పడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారని, వారి ఉసురు తగిలించుకోవద్దని, రోడ్ల మీద ఉన్న ధాన్యంను నాలుగు రోజుల్లో కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ల ముట్టడి చేస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు