దంచికొట్టిన వర్షం: గంటలకొద్దీ ట్రాఫిక్ జాం, వాగులో కొట్టుకుపోయిన ఇండికా
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షం కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీలోని విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
రాత్రి పూట వర్షం అందుకోవడంతో కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాదులోని పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ జాం అయి, మూడు నుంచి నాలుగైదు గంటల సమయం తీసుకుంటుంది.
హైదరాబాదులోని ఖైరతాబాద్, అమీర్ పేట, సోమాజిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, కూకట్ పల్లి, బేగంపేట, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్పీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

కోఠి, ఆబిడ్స్లో కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాదులో చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
వర్షంలోనే ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం..
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిమజ్జన వేళ జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
వాగులో కొట్టుకుపోయి ఒకరి మృతి
రంగారెడ్డి జిల్లా థరూర్ మండలం రాళ్లచిత్తంపల్లి వద్ద వాగులో దంపతులు గల్లంతయ్యారు. బైక్ పైన మైలార్దేవ్రాంపల్లి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. చెట్టుకొమ్మ పట్టుకుని భర్త ప్రాణాలతో బయటపడగా, భార్య మృతిచెందింది.
వాగులో కొట్టుకుపోయిన కారు
రంగారెడ్డి జిల్లా బంటారం మదువాపూర్ వాగు పొంగి పొర్లుతోంది. తాండూరు - వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, వాగులో ఓ ఇండికా కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ఆరుగురు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications